CM Revanth Reddy: కులగణన సర్వేను సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించామని, మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే పూర్తి చేశామని సీఎం పేర్కొన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందన్నారు. ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇందులో ఎస్సీలు-17.43 శాతం, ఎస్టీలు- 10.45 శాతం, బీసీలు- 46.25శాతం, ముస్లీం మైనార్టీల్లో బీసీలు- 10.08 శాతం, ముస్లీం మైనార్టీలు కలుపుకుని బీసీలు- 56 శాతం, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు- 15.79 శాతం ఉన్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
బీసీ వర్గాల జనాభాకు సంబంధించి గతంలో సరైన లెక్కలు లేవన్న సీఎం.. ఎవరికి తోచిన రీతిలో వారు లెక్కలు వేసుకున్నారని చెప్పారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందన్నారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా జనాభా లెక్కిస్తున్నా బలహీన వర్గాల జనాభాను లెక్కించలేదన్నారు. బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగలేదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే.. కులగణన చేయాలని భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భావించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.

కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారన్నారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామన్నారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారన్నారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామన్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు.56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అంతకు ముందు సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు రెండు గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేబినెట్ భేటీలో సీఎం మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు.












Click it and Unblock the Notifications