‘ధరణి’పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.

కాగా, సమీక్ష సందర్భంగా ధరణి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. అయితే మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. మార్పులు, చేర్పుల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సవరణలు అవసరమనే అంశాలపై ప్రజాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
రెవెన్యూ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్ పీటర్, ఎం.సునీల్ కుమార్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు, సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సమీక్షలో సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications