గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్లకు ఒక శుభవార్తను తెలియజేశారు.
సర్పంచ్ లకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త
గ్రామాల అభివృద్ధి కోసం ఇకపై నిధులను నేరుగా సర్పంచ్లకే కేటాయిస్తామని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి అంతా సర్పంచ్ ల చేతిలో ఉంటుందని ఆయన ఆన్నారు. పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులను అందజేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జారీ
ఈ నిధులు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ అవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి
తన రాజకీయ ప్రస్థానం కొడంగల్ నుంచే మొదలైందని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 2009 నుంచి మీరు నన్ను ఆదరించారు. మీ నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలన్న సీఎం రేవంత్
గ్రామాల్లో ఎటువంటి వివక్షకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్లకు సూచించారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తూ, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సీఎం రేవంత్ కోరారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, గ్రామాలే దేశానికి పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications