BRS చచ్చిపోయింది, కవిత పార్టీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్స్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ (BRS) పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శల ఘాటు పెంచారు. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, అది కేవలం గతం మాత్రమేనని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీపై స్పందిస్తూ, "ఉన్న పార్టీకే దిక్కులేదు.. ఇక కొత్త పార్టీతో ఏం చేస్తారు?" అంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మనుగడ కోల్పోయిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ. ఒక శవాన్ని ఎంత అందంగా అలంకరించినా ప్రయోజనం ఉండదు. ఆ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది" అంటూ విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య ఏనాడో బంధం తెగిపోయిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒక్కటేనని, ప్రజల ముందు వాళ్ళు ప్రదర్శించేది కేవలం తెచ్చిపెట్టుకున్న నటన మాత్రమేనని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి..
కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. ఆయన ఆరోగ్యంగా ఉండాలనే తాము కోరుకుంటామని రేవంత్ అన్నారు. "ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు మంచిది. ఆయన చావును నేనెందుకు కోరుకుంటాను? ఆయన మరమనిషో కాదో ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం కేసీఆర్ 'విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి' అని, తమ ప్రభుత్వానిది వివక్ష లేని పాలన అని, ప్రస్తుతం తమకు అసలైన ప్రతిపక్షమే లేదని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ గురి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ గురించి మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కేవలం కొన్ని సాంకేతిక లోపాలను మాత్రమే ఎత్తిచూపిందని స్పష్టం చేశారు. "నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పింది. అయితే, కాళేశ్వరం అక్రమాలపై తుది చర్యలు సీబీఐ (CBI) విచారణ తర్వాతే ఉంటాయి" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కాళేశ్వరం అంశం గులాబీ నేతలకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications