తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితే.. మీకు ఉద్యోగాలు: వదిలిపెట్టని సీఎం రేవంత్!
ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, స్వరాష్ట్రం ఏర్పాటు జరిగినా గత పదేళ్ళలో నిరుద్యోగ సమస్య తీరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో 10 వేల టీచర్లకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో సిఎం రేవంత్ మాట్లాడారు.
LB స్టేడియంలో టీచర్ల నియామక పత్రాలిచ్చిన సీఎం
హైదరాబాద్ LB స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో 10 వేల మందికి పైగా ఈ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణా పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తెలంగాణా సమాజాన్ని బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు చెప్పారు.

ప్రతిపక్షాల అవాంతరాలను తిప్పికొట్టి టీచర్ల నియామకాలు చేశాం
విద్యా రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నియామకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయనీ, అయితే అన్నీ అవాంతరాలనూ వ్యూహాత్మకంగా తిప్పి కొట్టి, అనుకున్న సమాయానికి నియామకాలను పూర్తి చేసినట్లు సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం టీచర్ల నియామకాలను విస్మరించిందని ఆరోపిస్తూ, విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు తీసుకోవలసిన అన్నీ చర్యలనూ తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
నిరుద్యోగుల సమస్యలు బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదు
రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారు కానీ తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. గతంలో రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయింది. నిరుద్యోగుల సమస్యలు బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు.
తండ్రీకొడుల ఉద్యోగాలు ఊడగొడితే.. మీకు ఉద్యోగాలు
అందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారని రేవంత్ తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. తండ్రీకొడుల ఉద్యోగాలు ఊడగొడితే.. మీకు ఉద్యోగాలు వస్తున్నాయని రేవంత్ కేసీఆర్ , కేటీఆర్ లను టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలలోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. డీఎస్సీ విజేతలను చూస్తుంటే దసరా ముందే వచ్చినట్లు ఉంది" అని రేవంత్ రెడ్డి చెప్పారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించిన అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం: భట్టి
అంతకు ముందు, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే అని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, వాటిని తిప్పి కొట్టి అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించడంతో పాటు పది వేలమందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం చాలా గర్వంగా ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణా
ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ సమాజాన్ని నిలబెట్టడానికి అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సంపద సృష్టిస్తున్నాట్లూ, సృష్టించిన సంపదను ప్రజలకు పంచటానికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications