Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, డీలిమిటేషన్ రాజ‌కీయ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళా బిల్లు పైన పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హ‌డావుడి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ను రెండింటిని ఒక‌టిగా చూపించి ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ రెండు అంశాలు ఒక‌దానికి ఒక‌టి సంబంధం లేనివని తెలిపారు.

"రెండింటిని విడ‌దీసి వేరు వేరుగా చ‌ర్చించి అమ‌లు పైన విధివిధానాల‌పైన ఒక సూచ‌న చేస్తున్నాను. రాజ్యాంగంలోనే పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్ప‌టికి ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు లేదు. పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ. దేశ ప్ర‌ధానిగా, రాష్ట్ర‌ప‌తిగా, లోక్ స‌భ స్పీక‌ర్ గా, ముఖ్య‌మంత్రులుగా, గ‌వ‌ర్న‌ర్లుగా చాలా రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ అవ‌కాశం క‌ల్పించింది. మ‌హిళల నాయ‌క‌త్వంలో ప‌నిచేసిన పార్టీ కాంగ్రెస్. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు తీసుకువ‌చ్చారు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చారు. అప్పుడు రాజ్య‌స‌భ లో ఆమోదించారు. బీజేపీ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే లోక్ స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదం పొంద‌లేదు. ఇంత కాలం మోదీ ఈ బిల్లును ప‌ట్టించుకోలేదు. 2023 లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చింది. 2026 త‌ర్వాత జ‌నాభా లెక్క‌ల త‌ర్వాత గెజిట్ ఆధారంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని చ‌ట్టం చేశారు. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 543 లోక్ స‌భ స‌భ్యుల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తే 181 మహిళ‌లు ఎన్నిక అయ్యేందుకు అవ‌కాశం ఉండేది. చ‌ట్టాన్ని లోక్ స‌భ‌లో ఆమోదించిన‌ప్పుడే అమ‌లు చేయ‌కుండా పిట్టింగ్ పెట్టి మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు దూరం చేసింది" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"2026 జ‌న‌భా లెక్క‌లు పూర్తి చేసి అమ‌లు చేయ‌కుండా 2011 జ‌నాభా లెక్క‌ల ఆధారంగా చ‌ట్టం ముందుకు తెస్తున్నారు.2026 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం నిబంధ‌న‌ను స‌వ‌రించుకుంటే 2029 లోక్ స‌భ‌తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయోచ్చు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, పున‌ర్విభ‌జ‌న ను క‌ల‌ప‌డంతో రాజ‌కీయ కుట్ర ఉంది. 2026 జనాభా లెక్క‌ల ప్ర‌కారం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకువ‌స్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు క‌ట్టుబ‌డి ఉంటాం. మ‌హిళల రాజ‌కీయ సాధికారిత‌కు కాంగ్రెస్ మొద‌టి నుంచి క‌ట్టుబ‌డి ఉంది" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

"నియోజ‌క‌వ‌ర్గాల పునర్వ‌భ‌జ‌న ను ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ పావుగా ప్ర‌మాద‌క‌రంగా వాడుకుంటున్నారు. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మూడు సార్లు జ‌రిగింది.. 1967 లో 520 సీట్ల‌కు పెంచారు,1976 లో 542 సీట్ల‌కు పెంచారు.. త‌ర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543 కి పెరిగింది.ద‌క్ష‌ణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్ర‌ణ ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌ జ‌నాభా త‌గ్గింది. ఉత్త‌రాధిలో కుటుంబ నియంత్ర‌ణ అమ‌లు కాక‌పోవ‌డంతో జ‌నాభా విప‌రీతంగా పెరిగింది.ఇందిరాగాంధీ ఈ విష‌యాన్ని గ‌మ‌నించి లోక్ స‌భ సీట్ల ప్ర‌కార‌మే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 25 ఏళ్ల వ‌ర‌కు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు.జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గొద్ద‌నే సీట్ల‌ను నియంత్రించారు" అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

"2001 లో వాజ్ పేయి పున‌ర్విభ‌జ‌న పైన చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. దాని వ‌ల్ల‌ 2009 లో తెలంగాణ‌కుచ 17 ఎంపీ సీట్లు , ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వ‌చ్చాయి. తెలంగాణ కు 119 అసెంబ్లీ సీట్లు , ఎపీకి 175 శాస‌న‌స‌భ సీట్లు పెరిగాయి. 2026 వ‌ర‌కు చ‌ట్ట‌ప‌రంగా సీట్ల పెంపు పైన నిషేధం విధించారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పున‌ర్విభ‌జ‌న కు ఒప్పుకోమ‌ని ద‌క్షణాది రాష్ట్రాలు నిర‌స‌న తెల‌ప‌డంతో పాటు ప్ర‌ధానికి లేఖ రాశాయి. మేం ఒప్పుకోమ‌ని చెప్ప‌డంతోనే దామాషా ప్ర‌కారం అని చెపుతున్నారు. యాభై శాతం సీట్లు పెంచుతామ‌ని అంటున్నారు. 20 సీట్లు ఉన్న కేర‌ళ కు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంత‌రం ప్ర‌స్తుతం 60 సీట్లు మాత్ర‌మే.. కాని యాభై శాతం పెంచితే 90 సీట్ల‌కు గ్యాప్ పెరుగుతుంది.. అంత‌రం బాగా పెరుగుతుంది" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"తెలంగాణ‌కు , యూపీ కి 94 సీట్ల అంత‌రం పెరుగుతుంది. ద‌క్ష‌ణాదిలో 130 సీట్లు ఉన్నాయి.. యాభై శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లు ఉత్త‌రాదిలో ఉన్నాయి, పెంచితే 621 సీట్లు అవుతాయి. ద‌క్ష‌ణాది, ఉత్త‌రాద మ‌ధ్య అంత‌రం 412 నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. బీజేపీ హ‌యాంలో ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌కు కేంద్రంలో కీల‌క‌మైన శాఖ‌ల‌ను ఇవ్వ‌లేదు. రాష్ట్ర‌ప‌తి నుంచి కీల‌క‌మైన ఏ ప‌ద‌వి ని ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌కు ఇవ్వ‌లేదు. బ‌ల‌హీనుడు, బ‌ల‌వంతులు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌వు. స‌మాన స్థాయి ఉన్న వారి మ‌ధ్య చ‌ర్చ‌లు ఉంటాయి. రాజ‌కీయంగా ద్వితీయ శ్రేణి రాష్ట్రాలను మార్చ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిన్న రాష్ట్రాల‌కు కూడా స‌మ‌స్య ఉండ‌బోతుంది.. ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాజ‌కీయ మ‌నుగ‌డ కోల్పోతాయి.ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాల‌కు తీర‌ని విఘాతం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"ఏ ప్రాతిప‌ద‌క న సీట్లు పెంచాలో మొద‌ట చ‌ర్చించాలి.. యాభై శాతం పెంచాల‌ని మోదీకి ఏ దేవుడు చెప్పారు..? రాజ‌కీయ అవ‌స‌రాల కోసం యాభై శాతం సీట్లు అంటున్నారు.. దేశ మ‌నుగ‌డ‌కు మంచి కాదు. ఇది రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించిన‌ది కాదు.. ప్ర‌జ‌ల‌కు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, న‌క్స‌లైట్ లాంటి స‌మ‌స్య‌లు వివ‌క్ష వ‌ల్ల నే వ‌చ్చాయి.వివ‌క్ష ను ఇంకా పెంచ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌హిళ బిల్లు ముసుగులో అడ్డు ప‌డుతున్నారు.. త‌క్ష‌ణ‌మే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అమ‌లు చేయాలి.ప్ర‌స్తుతం ఉన్న‌ లోక్ స‌భ‌, అసెంబ్లీ స్థానాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలి. ద‌క్ష‌ణాది రాష్ట్రాలు ఆర్థిక రాజ‌ధానులు.. ఉత్త‌రాధి రాష్ట్రాలు రాజ‌కీయ రాజ‌ధానులు.ప‌న్నులు క‌ట్ట‌డం, స‌లామ్ చేయ‌డానికి మేం వ్య‌తిరేకం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"సీట్ల పున‌ర్విభ‌జ‌న పైన హైబ్రీడ్ మోడ‌ల్ ను నేను ప్ర‌పోజ్ చేస్తున్నాను. పెంచాల‌నుకుంటున్న 272 సీట్ల‌లో 136 సీట్లు ప్రొరేటా ప్ర‌కారం.136 సీట్లు జీఎస్ డీపీ ప్ర‌కారం సీట్ల‌ పున‌ర్విభ‌జ‌న చేయాలి. స్థూల ఉత్ప‌త్తిలో అత్య‌ధికంగా భాగ‌స్వామ్యం చేస్తున్న రాష్ట్రాల‌కు అవ‌కాశం ఇవ్వాలి.ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జ‌నాభా ప్రాతిపాదిక‌న సీట్లు లేవు.100 శాతం జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పెంపు జ‌ర‌గ‌లేదు.. ప్రాతినిధ్యం కోస‌మే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారు.. దేశానికి ద‌క్ష‌ణ భార‌త‌దేశం దేశానికి ఆదాయాన్ని, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మ‌మ్మ‌ల్ని ఎలా శిక్షిస్తారు.. ?

విద్యా, ఉద్యోగ అవ‌కాశాల్లో యాభై శాతం రిజ‌ర్వేష‌న్లు, యాభై శాతం మెరిట్ తో చేయాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.అందుకే రిజ‌ర్వేష‌న్లు యాభై శాతానికి మించ‌లేదు. సీట్ల పున‌ర్విజ‌భ‌న పైన అఖిల పక్ష స‌మావేశంతో పాటు అన్ని సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు చేయాలి. పార్ల‌మెంటులో పున‌ర్విభ‌జ‌న పైన చ‌ర్చించాలి. నిపుణ‌ల‌తో ఒక క‌మిటీ ఏర్పాటు చేయాలి. అన్ని అసెంబ్లీల్లో చ‌ర్చ‌కు పెట్టి పార్ల‌మెంటులో ఆమోదించి నిర్ణ‌యం తీసుకోవాలి.2028 మార్చి వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయోచ్చు...హ‌డావుడి గా చేసి దేశంలో ద‌క్ష‌ణ‌, ఉత్త‌రాది మ‌ధ్య గ్యాప్ పెంచొద్దు.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సీట్ల పున‌ర్విభ‌జ‌న‌లో ప‌ర్సంటేజీలు కాదు నెంబ‌ర్ ముఖ్యం..

రాజ‌కీయాల్లో నెంబ‌ర్ ముఖ్యం. వాజపేయి ప్ర‌భుత్వం ఒక్క ఓటుతో ప‌డిపోయింది. నెంబ‌ర్ లేకుండా రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఎవ‌రితోనూ చ‌ర్చ‌లు చేయ‌రు. బాగా ప‌నిచేస్తున్న రాష్ట్రాల‌ను శిక్షించ‌వ‌ద్దు. 1980 ఏప్రిల్ 6 బీజేపీ ఏర్పాటైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 15 మంది బీజేపీ అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగింది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షురాలి గా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదు. బీజేపీకి మ‌హిళ ప‌ట్ల గౌర‌వం, చిత్త‌శుద్ది ఉందో అర్థ‌మౌతుంది. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో అతి ఎక్కువ కాలం ప‌నిచేసిన పార్టీ కాంగ్రెస్ మ‌హిళ‌ల‌కు అన్యాయం చేస్తుందా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

బీజేపీకి మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిగా నియ‌మించుకున్న త‌ర్వాత‌ బండి సంజ‌య్ మాట్లాడాలి. బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు ద‌క్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం. మా ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పున‌ర్విభ‌జ‌న పైన కూడా పోరాడుతారు. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం. 60 యేళ్ల‌లో మ‌హిళ‌ల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. 46 యేళ్ల‌లో ఒక్క మ‌హిళ ను పార్టీ అధ్య‌క్షురాలి ని బీజేపీ చేయ‌లేదు.. జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీ ఆర్గ‌నైజేష‌న్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు.. అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CMRevanth Reddy Calls Women s Reservation and Delimitation a Political Conspiracy Key Observations

మ‌హిళ‌ల‌ను చిన్న చూపు చూడ‌ట‌మే బీజేపీ ల‌క్ష‌ణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళ‌ల‌ను చూస్తున్నారు. స్వాతంత్ర్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్య‌త కూడా కాంగ్రెస్ దే. యాభై శాతంతో సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది.. వాళ్ల అవ‌స‌రం ఇక ముందు ఉండ‌దు. అన్ని ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాల‌కు దీనిపైన లేఖ రాస్తాను.. అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+