తెలుగు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీ టార్గెట్ ఫిక్స్- కీలక ప్రకటన..!!
కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ఒక సంచలనం. ఢిల్లీలో నిరసనలు హోరెత్తించి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇప్పుడు ఈ పార్టీ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ పార్టీ ఇప్పుడు ఇక సంచలనంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ కార్యాచరణ పూర్తి కాలేదని.. అన్ని అంశాల పైనా స్పందిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తమ లక్ష్యాలను వెల్లడించారు. కీలక ప్రకటన చేసారు.
కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను సంచలంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు ఆమోదం తెలిపేలా ఒత్తిడి తెచ్చి ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రితో రాజీనామా చేయించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ పార్టీ నిర్వహించిన నిరసనలకు విద్యార్థి లోకం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. కాగా.. ఇప్పుడు ఈ పార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరణ పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తమ కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చింది. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన ఈ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీజేపీ ఆందోళనలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు పలువురు యువ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం, అరాచకం జరిగిన ప్రతిచోటా సీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేసారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యాచరణ
ఓయూ, కాకతీయ, హెచ్సీయూ యూనివర్సిటీలకు చెందిన పలువురు కాక్రోచ్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఇది జెన్-జీ తరంగా చెప్పిన యువకులు..మోసపూరిత విధానాలను చూస్తూ సీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసారు. సీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదని తేల్చి చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగానూ ప్రభుత్వాల అక్రమాలపై నిరంతరం పోరాడుతుందని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ నేత కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని సీజేపీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసారు. హెచ్సీయూ భూములు, కేబీఆర్ పార్కు అడవుల పరిరక్షణ కోసం ఇప్పటికే పోరాటం చేశామని, భవిష్యత్తులోనూ విద్యా, వైద్య రంగాల్లో జరిగే అన్యాయాలపై ఉద్యమిస్తామని ప్రకటించారు. తాము నిర్వహిస్తున్న పోరాటాలకు మద్దతుగా నిలిచేవారు.. తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకునే వారు 7277773355 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాక్రోచ్ పార్టీకి ఎలాంటి మద్దతు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications