తెలంగాణను వణికిస్తున్న చలి.. 10డిగ్రీల కంటే తక్కువగా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు; వాళ్ళు జాగ్రత్త!!
తెలంగాణ రాష్ట్రంలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మండూస్ తుఫాను ప్రభావం బాగా కనిపిస్తుంది. విపరీతమైన చలిగాలులుతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇక ఉదయం 11 గంటల వరకు కూడా చాలా నగరాల్లో మంచు కురుస్తూనే ఉంటుంది. శీతాకాలం ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు .. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 5.9 డిగ్రీలు
ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నపరిస్థితి ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందని జనం భావిస్తున్నారు.
ఇక ఉదయాన్నే పొగమంచుతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో శుక్రవారం ఉదయం 5.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలిపులి దెబ్బకు వణికిపోతున్నారు.

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
ఇక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. బోథ్ మండలం పొచ్చెరలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో విపరీతంగా చలి తీవ్రత పెరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ లలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అవుతున్న పరిస్థితి ఉంది.

తెలంగాణా వ్యాప్తంగా పరిస్థితి ఇలా... తుఫాన్ ప్రభావంతో చలిగాలులు
ఉత్తర తెలంగాణ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య జిల్లాలలో 16 డిగ్రీల సెల్సియస్ నుండి 19 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పడిపోతున్న పరిస్థితి ఉంది. ఇక తుఫాను కారణంగా ఈదురుగాలులతో కూడిన చలి తీవ్రత మరింత పెరిగింది. ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలంటేనే చలి దెబ్బకు భయపడిపోతున్నారు.

చలి దెబ్బకు పెరుగుతున్న ఆస్తమా, సైనసైటిస్ బాధితులు... జాగ్రత్త
వికారాబాద్ జిల్లా తాండూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం భాగ్యనగర్ నందనవనం ప్రాంతంలో కూడా 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రోజంతా చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇక ప్రస్తుతం చలి దెబ్బకు చాలామంది ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతంగా చలి పెరిగిన కారణంగా ఉదయం, రాత్రి పూట బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని, ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications