Weather Update: పెరుగుతున్న చలిగాలులు.. వారం రోజుల పాటు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కొంత తగ్గిన చలి తీవ్రత మళ్లీ పెరగుతుంది. రాబోయే వారం రోజుల పాటు (జనవరి 5 నుంచి 12 వరకు) ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీచే చలిగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు తొలి వారంలో కనిపించిన చలి గాలుల తీవ్రత రానున్న వారం రోజుల్లో మరో సారి పునరావృతం కావచ్చని వాతావరణ శాఖ సూచనలు తెలిపింది.
ప్రస్తుతం ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, ప్రస్తుతం ఉన్న చలి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
చలి గరిష్ఠ స్థాయికి...
సంక్రాంతి పండుగ సమయానికి చలి గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి చివరి వారంలో నుంచి మాత్రమే ఎండ తీవ్రత క్రమంగా పెరిగి శీతాకాలం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కోహిర్లో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పగటి వేళల్లో కూడా చలి ప్రభావం కనిపించనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకునే సూచనలు ఉన్న నేపథ్యంలో వాహనదారులు ఉదయం వేళల్లో అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
జాగ్రత్తగా ప్రయాణాలు...
చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణాలు చేసే వారు పొగమంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాల్సిందిగా వాతావరణ శాఖ కోరింది.












Click it and Unblock the Notifications