సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి సూటి ప్రశ్న..!
హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటూనే తనపై సయ్యద్ సుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ ఆరోపణలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో స్క్రిప్ట్ తయారు చేసుకుని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ లండన్లో సయ్యద్ సుజాతో ఆరోపణలు చేయించారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సయ్యద్ సుజా ఎవరో.. అతని ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన దుయ్యబట్టారు. తాను 11 మందిని చంపితే వాళ్ల కుటుంబసభ్యులు ఆ వ్యక్తులపై మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టలేదని కిషన్రెడ్డి నిలదీశారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఓడిపోయినదానికంటే తమ పార్టీ 5 స్థానాల నుంచి ఒకటికి పడిపోవడం బాధించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.