పైలట్ రోహిత్ రెడ్డి కనిపించటం లేదు.. ఎవరైనా కిడ్నాప్ చేశారా? తాండూరు పోలీసులకు ఫిర్యాదు!!
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా అజ్ఞాతంగానే ఉంటున్నారు. ఎవరినీ కలవడం లేదు. నియోజకవర్గ ప్రజల దగ్గరకు వెళ్లడం లేదు. దీంతో తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డిపై ఒక ఆసక్తికరమైన ఫిర్యాదు తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఎమ్మెల్యే కనిపించటం లేదని తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఇరవై రోజుల నుంచి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేరని.. 20 రోజులుగా ఆయన కనిపించడం లేదు కాబట్టి ఆయన మిస్సింగ్ అయ్యారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక బలవంతంగా నిర్బంధించారా ? అనే విషయాన్ని వెంటనే తేల్చాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఇరవై రోజుల నుంచి నియోజకవర్గంలో ఆయన లేకపోవడంతో స్థానిక ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు అని పేర్కొన్నారు.
కిడ్నాప్ చేశారా? లేక బలవంతంగా నిర్బంధించారా? తేల్చండి
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే కనిపించకుండా పోవడం తోనే తాము ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకీ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఆయనను కిడ్నాప్ చేశారా? లేక బలవంతంగా నిర్బంధించారా? అనే విషయాన్ని తేల్చాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పోలీసులను కోరారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నుండి ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా కేసీఆర్ ఆదేశాల మేరకు బయట ఎవరినీ కలవకుండా, ఎవరితోనూ ఈ విషయంపై మాట్లాడకుండా అజ్ఞాతంగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దూకుడు
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం, దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఇప్పటికే నిందితులను విచారించడం తో పాటు, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న నేతలకు నోటీసులు పంపిస్తుంది.
తాజాగా బి ఎల్ సంతోష్ కు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 21వ తేదీన ఉదయం 10:30 కు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు.