సచివాలయంలో కండోమ్లు... ఏమి జరుగుతోంది..?
సచివాలయం...రాష్ట్ర పరిపాలనకు ఒక గుండెలాంటిది లేదా దేవాలయం అని చెప్పొచ్చు. అలాంటి ఈ పవిత్రమైన స్థలం కొన్ని అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా మారింది. గతేడాది అమరావతిలోని సచివాలయంలో మద్యం బాటిళ్లు బయటపడిన ఘటన మరువక ముందే ఈ సారి హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలో కండోమ్స్ ప్యాకెట్లు కలకలం సృష్టించాయి.
పరిపాలన జరగాల్సిన చోట అసాంఘీక కార్యకలాపాలు పేట్రేగిపోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు జరగాల్సిన చోట అరాచక చర్యలు దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలో దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక ఏపీకి హైదరాబాద్లోనే సచివాలయం కేటాయించారు. అయితే అమరావతి నుంచే పాలన జరుగుతుండటంతో ఈ సచివాలయంలో పెద్దగా ఉద్యోగులు కనిపించరు. బయట నుంచి చూస్తే ఓ టెంటు వేసుకుని పోలీసులు పహారా కాస్తుండటమే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు లేక వెలవెల బోతున్న సచివాలయం కేంద్రంగా కొందరు చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు.
ఆదివారం రోజున సచివాలయంలోని ఎల్ బ్లాక్ పక్కనే ఉన్న మీడియాపాయింట్ సమీపంలో కండోమ్ ప్యాకెట్లు కలకలం రేపాయి. ముందే సచివాలయం జనాలు లేక ఖాళీగా ఉండటం అందున ఆదివారం కావడంతో కొందరు రెచ్చిపోతున్నారు. అసాంఘీక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. అంతేకాదు ఈ ఘటనతో మరోసారి అక్కడి భద్రత నిఘా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం హై సెక్యూరిటీ జోన్లో ఉండే సెక్రటేరియట్లోకి కండోమ్ ప్యాకెట్లు ఎలా వెళ్లాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ఈరోజు బయటపడ్డాయి కాబట్టి వెలుగులోకి వచ్చింది... బయట పడకుంటే ఈ అసాంఘీక కార్యక్రమాలు కొనసాగేవి అంటూ ప్రజాంసంఘాలు ధ్వజమెత్తాయి. పవిత్ర స్థలం అయిన సచివాలయంలోకి నిరోద్ ప్యాకెట్స్ ఎలా వెళ్లాయో విచారణ చేసి అందుకు కారణమైన వారిని శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు.