రైతు ఆత్మహత్యలు: కెసిఆర్ ప్రభుత్వపై కాంగ్రెసు అవిశ్వాసం?
హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరించడంలో, రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. శుక్రవారం సిఎల్పి నేత కె.జానారెడ్డి సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
మిగతా పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యులు అనుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి రైతుల రుణాలను మాఫీ చేయాలనే తమ డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించకపోవడంపై కాంగ్రెసు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రైతుల అంశంపై రెండు రోజుల పాటు చర్చకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, తాము చెప్పదలచుకున్నదే చెప్పిందని, ప్రభుత్వం చెల్లించాల్సిన మిగతా 50 శాతం రుణ మాఫీనైనా వన్టైం సెటిల్మెంట్ చేస్తామన్న హామీ ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే చర్చకు స్పీకర్ అనుమతించాల్సి వస్తుందని, అప్పుడు మరో రెండు, మూడు రోజులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయడానికి అవకాశం చిక్కుతుందని కాంగ్రెసు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని, తమకో కలిసి రావాలని కాంగ్రెసు మిగతా పార్టీలను అడిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు తిరిగి 5వ తేదీన ప్రారంభమవుతున్నాయి. ఈలోగా మిగతా ప్రతిపక్షాలతో ఆ పార్టీ నేతలు మాట్లాడనున్నారు.
కాగా, రైతుల సమస్యలపై పోరాడడంలో కాంగ్రెస్ విఫలమైందని, సిఎల్పి నేత కె.జానారెడ్డి ఆశించిన విధంగా ప్రభుత్వంపై విరుచుకుపడలేదని కాంగ్రెసులోని ఓ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని సమావేశంలో ఓ శాసనసభ్యుడు ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
అయితే అసెంబ్లీలో తాము విఫలం కాలేదని, సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టామని, వన్టైం సెటిల్మెంట్ విషయంలో ప్రభుత్వం మెట్టు దిగిందని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెల్లిస్తున్న 6 లక్షల పరిహారాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇవ్వాలన్న తమ డిమాండ్కూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు.












Click it and Unblock the Notifications