"నేరెళ్లలో కెటిఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరు గార్చారా ?"
హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఘటనకు బాధ్యత వహించి ఇప్పటికే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన కెటిఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని తెలంగాణ కాంగ్రెసు కమిటీ కోశాధికారి, ఎఐసిసి సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు.
నేరెళ్ల ఘటనపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. తద్వారా ప్రభుత్వ నిజ స్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు. పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్న తీరును న్యాయస్థానాల దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు.

నేరెళ్ల ఘటనకు బాధ్యత వహించి మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని పిసిసి అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు సరైన సమాచారం ఇవ్వలేనది కెటిఆర్ బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు.
కటిఆర్ శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. సంఘటన జరిగిన ఐదు వారాలకు బధితులను పరామర్శించడానికి వెళ్లిన కెటిఆర్ ప్రజా సమస్యలపై ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తోందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.












Click it and Unblock the Notifications