రాజగోపాల్ ను దెబ్బ తీసిన కాంగ్రెస్ - మారిపోతున్న ఆధిక్యతలు..!!
మునుగోడు ఎన్నికల ఫలితాల్లో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడులో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలం పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించినా.. చౌటుప్పల్, మునుగోడు లో తనకు కలిసి వస్తుందని రాజగోపాల్ ఆశించారు. ఇప్పటి వరకు పూర్తయిన నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ మెజార్టీతో ఉంది. 608 ఓట్ల మెజార్టీయే కనిపిస్తున్నా.. ఇతర రౌండ్ల కౌంటింగ్ కొనసాగే ప్రాంతాల్లో హోరా హోరీ ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
చౌటుప్పల్ లో సాధ్యమైనంత మెజార్టీ సాధిస్తే..ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ సాధించే ఓట్లను బ్యాలెన్స్ చేయవచ్చని అంచనా వేసారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ రాజగోపాల్ అంచనాలను దెబ్బ తీసింది. ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించిన ఫలితాల మేరకు టీఆర్ఎస్ కు 26343 ఓట్లు పోల్ కాగా, బీజేపీకి 25730 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు 8200 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్ల కౌంటింట్ చౌటుప్పల్ కు సంబంధించనవే. ఇక, ఈ ఫలితాల ట్రెండ్స్ పైన అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
చౌటుప్పల్ లో ఆశించిన మెజార్టీ రాలేదని అంగీకరించారు. ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందిని చెప్పారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పిన రాజగోపాల్ రెడ్డి చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని అంచనా వేసారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అటు టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు ఖాయమంటూ పోలింగ్ కేంద్రం వద్ద ధీమా వ్యక్తం చేసారు కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. నాలుగు రౌండ్ల లెక్కింపులో తొలి, నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించగా.. రెండు - మూడు రౌండ్లలో రాజగోపాల్ ఆధిక్యత ప్రదర్శించారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రస్తుతానికి టీఆర్ఎస్ మెజార్టీతో ఉన్నా స్వల్ప ఓట్లు తేడా ఉంది. ఇక, నారాయణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆ తరువాత మునుగోడు ప్రాంతానికి చెందిన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. చౌటుప్పల్ లో కౌంటింగ్ పూర్తి కావటంతో ఒక రకంగా బీజేపీకి డిసప్పాయింట్ మెంట్ గా మారింది. చుండూరు ..మర్రిగూడ మండలాల్లో ఆధిపత్యం సాధించే పార్టీ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన రౌండ్లలో ఎటువంటి ఫలితాలు వెల్లడి కానున్నాయనేది ఉత్కంఠ పెంచుతోంది.