నేడు టీఆర్ఎస్లోకి దానం, 'రెండేళ్ల నుంచే టచ్లో ఉన్నారు': హైదరాబాద్పై కేసీఆర్ వ్యూహం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలతో దానం ప్రగతి భవన్కు ర్యాలీగా వెళ్తారు. అక్కడ అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. శనివారం దానం మాట్లాడుతూ... కేసీఆర్ బడుగుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో కార్యకర్తగా అయినా పని చేస్తానన్నారు. కాంగ్రెస్లో ఓ వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే పార్టీ వీడినట్లు చెప్పారు.
దానం నాగేందర్ ఆరోపణలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. దానం రెండేళ్లుగా తెరాసతో టచ్లో ఉన్నారని చెప్పారు. ఆయన పార్టీ వీడటం ముందుగా ఊహించిందేనని చెప్పారు. టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు గతంలో ఫ్లెక్సీలు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. పార్టీలు మారటం కూడా దానం నాగేందర్కు కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీకి వెళ్లి తిరిగి వచ్చి కాంగ్రెస్లో మంత్రి పదవి అనుభవించారన్నారు.
రెండేళ్లుగా టీఆర్ఎస్తో టచ్లో దానం
ఇప్పుడేమో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సొంత ఎజెండా కోసమే పార్టీ మారుతున్నారు తప్ప దానంకు మరో సమస్య లేదన్నారు. దానం పార్టీ మరడాన్ని పార్టీ నేతలు ఎవరూ తీవ్రంగా తీసుకోవాల్సిన పని లేదన్నారు.
కుంతియా
కొంతమంది నాయకులు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్కు వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా అన్నారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్కు 10 శాతం ఓటు బ్యాంకు పెరిగిందని, తాజా సర్వేలూ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కొందరు నేతలు పార్టీని వీడితే నష్టం లేదన్నారు. కొత్తగా నియమించిన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు ఒక్కొక్కరికి రాష్ట్రంలో 40 నియోజకవర్గాల చొప్పున పని విభజన చేసినట్లు చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై వివరణ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న ఉహాగానాలను కుంతియా కొట్టిపారేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. డిసెంబరులో ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
దానం దారిలోనే మరికొందరు నేతలు
దానం నాగేందర్ దారిలోనే మరికొందరు నేతలు టీఆర్ఎస్లో చేరనున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, మరికొందరు నేతలూ దానం వెంట చేరనున్నారని తెలుస్తోంది. హైదరాబాదులో తెరాసకు గట్టి లీడర్లు లేరు. దీంతో 2014 ఎన్నికల నుంచి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ఇతర పార్టీ నేతలపై కన్నేసింది. అయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు పట్టు ఉన్న నేతలు లేరు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, కైరతాబాద్, గోషా మహల్, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట వంటి ఎన్నో నియోజకవర్గాల్లో గట్టి నేతలు లేరని అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం తెరాస వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కూడా తెరాస దృష్టి సారించిందని అంటున్నారు.