సెంటిమెంట్తోనే కెసిఆర్పై కాంగ్రెస్ ఫైట్: రాహుల్ గాంధీ సభ ప్రత్యేకత ఇదే...
కెసిఆర్పై పోరాటానికి సెంటిమెంట్కు తెర తీయాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. పనిలో పనిగా అమిత్ షా వ్యూహానికి బ్రేకులు వేయాలని కూడా చూస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై సెంటిమెంట్తోనే సమరం సాగించాలని కాంగ్రెసు పార్టీ అనుకుంటోంది. అదే సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆకర్ష్ వ్యూహాన్ని దెబ్బ తీయాలని కూడా అనుకుంటోంది. మెదక్ జిల్లా సెంటిమెంటును నమ్ముకుని కెసిఆర్ను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఉంది.
అందుకే సంగారెడ్డిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే బహిరంగ సభకు ప్రత్యేకత ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తద్వారా 1980లో మాదిరిగా 2019లో మళ్లీ అధికారంలో వస్తామని వారు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్ల తర్వాత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో కాంగ్రెసు సభను ఏర్పాటు చేస్తోంది.
ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారు. సభ ఏర్పాటుకోసం పాత జిల్లాలైన వరంగల్, కరీంనగర్, నల్గొండలతో పాటు మెదక్లో ఏదో ఒక చోట సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెసు మొదట భావించింది. చివరగా మెదక్ జిల్లాలోని సంగారెడ్డిని వేదికగా ఎంచుకుంది. గతంలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే కాంగ్రె్సకు మెదక్తో సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది.
సెంటిమెంట్ ఇదే...
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1978లో సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సభను ఏర్పాటు చేశారు. అయితే మర్నాడు తెల్లవారుజామున 3 గంటలకు ఇందిర సభా స్థలికి వచ్చారు. అయినా ప్రజలు ఓపికగా నిరీక్షించారని, అది చూసి చలించిపోయిన ఆమె మెదక్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇందిరా గాంధీ ప్రధాన ప్రత్యర్థి ఆయనే..
1977లో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అప్పట్లో ఇందిరా గాంధీని జైలుకుకూడా పంపారు. దీంతో ఆమెపై ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన ఇందిరా గాంధీ ప్రధాని వదవిని చేపట్టారు. మెదక్ పార్లమెంటు స్థానంలో ఇందిరా గాంధీ ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు ఎస్.జైపాల్రెడ్డి. ఆయన జనతా పార్టీ నుంచి పోటీ చేశారు.
చిదంబరం ఇలా అనుకున్నారు...
2014లో కేంద్ర మాజీమంత్రి చిదంబరం మెదక్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకుగాను ఆయన మెదక్ జిల్లా ఎమ్మెల్యేలనుకూడా సంప్రదించారు. అలా అనుకుంటున్న తరుణంలోనే తెలంగాణ ఏర్పాటు వేగవంతమైంది. 1982లో ఏఐసీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ రాష్ట్రానికి వచ్చినపుడు సిద్దిపేట సమావేశంలో పాల్గొన్నారని అప్పటి యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న వీహెచ్ హనుమంతరావు గుర్తు చేసుకున్నారు.
ఆవిర్భావ ఉత్సవాలకు ముందే...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జూన్ 2వ తేదీన జరగనున్నాయి. ఈ సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొంటారనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు రోజే రాహుల్ గాంధీ సభను పెట్టడం ద్వారా తమ బలమేమిటో చూపించుకోవాలనే ఉద్దేశం కూడా కాంగ్రెసుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభకు ప్రజాగర్జన అనే పేరు పెట్టారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
సోనియా కాదంటే వచ్చేదా...
సోనియా గాంధీ అంగీకరించకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని కాంగ్రెసు నాయకులు ప్రజాగర్జన సభ ద్వారా కెసిఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. సోనియా వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని కెసిఆర్ కూడా అంగీకరించిన విషయాన్ని బహుశా రాహుల్ గాంధీ గుర్తు చేసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ప్రజా గర్జన సభలో వేసే ప్రశ్నలకు మర్నాడు జరిగే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ సభలో కెసిఆర్ సమాధానం చెప్పాల్సి రావచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి కెసిఆర్ ఆ ప్రశ్నలను ప్రస్తావిస్తారా, లేదా అనేది కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.
అమిత్ షా వ్యూహానికి బ్రేక్...
జూన్ 1వ తేదీ రాహుల్ గాంధీ సభ ద్వారా తెలంగాణలో అమిత్ షా వ్యూహానికి బ్రేకులు వేయాలని కూడా కాంగ్రెసు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సభ కన్నా ముందే అమిత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెసు పార్టీ నేతలను బిజెపిలోకి ఆహ్వానించడానికి చర్చలు జరుపుతారని అంటున్నారు. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల ద్వారా బిజెపిలోకి వెళ్లాలని భావిస్తున్నవారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెసు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపిలోకి వెళ్లడానికి తమ పార్టీకి చెందినవారు ఎవరెవరు సిద్దంగా ఉన్నారో తేల్చుకోవడానికి కూడా అవకాశం చిక్కుతుందని అనుకుంటున్నారు.
కాంగ్రెసుకు లక్ష్మణ్ కౌంటర్
కాంగ్రెస్ నేతల ఇంటికివెళ్లి బిజెపిలో చేరాలని తమ పార్టీ నేతలు అడగలేదని, అలా అడిగినట్లయితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ తెలగాణ కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్ కాంగ్రెస్ నేతలను గాని, సునీతా లక్ష్మారెడ్డిని గాని బీజేపీలో చేరాల్సిందిగా తాము కోరలేదని చెప్పారు. టీఆర్ఎ్సలోకి కాంగ్రెస్ నేతలు వలసలు పోకుండా ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సలహా కూడా ఇచ్చారు.