ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కుమ్ములాట: జంగా వర్సెస్ నాయిని; అధిష్టానానికి అల్టిమేటం!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఆధిపత్య పోరులో పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మాత్రం 3 పంచాయితీలు 6 కొట్లాటలు అన్నట్లు సాగుతోంది.

తెలంగాణా కాంగ్రెస్ నేతల లొల్లి .. అధిష్టానానికి తలనొప్పి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడం కోసం బీజేపీ క్షేత్రస్థాయిలో పని చేయడం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి ఫోకస్ గా ముందుకు వెళ్లాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చిరాకుగా తయారయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రంలో నేతల మధ్య పంచాయతీలను తీర్చడం పెద్ద తలనొప్పిగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు
ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు పార్టీ పరువును మరింత దిగజార్చేలాగా తయారైంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పై విరుచుకుపడ్డారు.

జంగా రాఘవ రెడ్డి చిల్లర నాయకుడని నాయిని ఫైర్
జంగా రాఘవరెడ్డి హనుమకొండ లో పాగా వేయడం కోసం కొంతమంది కోవర్టులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం గొడ్డు చాకిరి చేస్తున్నానని పేర్కొన్న ఆయన జంగా రాఘవ రెడ్డి లాంటి చిల్లర నాయకులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది అని మండిపడ్డారు. జంగా నీ జిల్లా ఏది? ఏ నియోజకవర్గానికి నువ్వు ఇంచార్జ్? మరి ఏ జిల్లాలో నీ నీచ రాజకీయాలు చేస్తున్నావ్ అంటూ నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జంగా రాఘవరెడ్డి నీచ రాజకీయాల పై పది సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయిని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధిష్టానానికి నాయిని రాజేందర్ రెడ్డి డెడ్ లైన్
ఈ నెల 31వ తేదీ వరకు జంగా రాఘవరెడ్డి వ్యవహారంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని తేల్చిచెప్పారు. అధిష్టానం ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి కొనసాగుతోంది. ఇక జిల్లాలో తాజాగా నాయిని రాజేందర్ రెడ్డి ఇచ్చిన అల్టిమేటం ఉమ్మడి వరంగల్ జిల్లా లో కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతుంది.

తెలంగాణా కాంగ్రెస్ ని అధిష్టానం గాడిలో పెడుతుందా?
ఏది ఏమైనా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గించటానికి, పార్టీలో ఉన్న నేతలు మధ్య సయోధ్య కుదర్చడానికి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు చాలా మంది పార్టీని వీడి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications