తెలంగాణలో బీజేపి గెలుపు కోసం కాంగ్రెస్ తెగ ఆరాటపడుతోంది.!మంత్రి నిరంజన్ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు.!
హైదరాబాద్ : ఏఐసిసి ఛీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ రాజకీయాలను కుదిపేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన మొదలుకొని, ముగిసేంత వరకూ అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు రాహుల్ గాందీ పర్యటన పైన పలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి తెలంగాణ బీజేపిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందని అనూహ్యంగా స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. స్పష్టం చేసిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ పౌరులను వలసల పాలుచేసింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలను వంచించింది కాంగ్రెస్ అని, తెలంగాణను నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని శాపనార్ధాలు లంకించుకున్నారు. బీజేపీని ఎదుర్కోవడం చేతగాక కాంగ్రెస్ చేతులు ముడుచుకుని కూర్చున్నదని, నిర్మాణాత్మక ప్రతిపక్షం లేక నేడు దేశంలో బీజేపీ ఆడింది ఆట పాడింది పాటగా మారిందని కాంగ్రెస్ పార్టీపైన ఆగ్రహం వ్యక్తం చేసారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు.. ప్రజలు ఎలా మర్చిపోతారన్న మంత్రి
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని గానీ, బీజేపీని గానీ రాహుల్ గాంధీ పార్లమెంటు బయటా, లోపలా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని, ఎవరికి భయపడి రాహుల్ గాంధీ ప్రశ్నించడం లేదో తెలంగాణ ప్రజలుకు వివరించాలని వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణలో బీజేపీ గెలుపుకోసం బీజేపీకన్నా ఎక్కువగా కాంగ్రెస్ ఆరాటపడుతుందని, గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్ శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో ఈ విషయం స్పష్టమయిందన్నారు నిరంజన్ రెడ్డి.

టీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి.. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నరన్న వ్యవసాయ మంత్రి
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రజలు తెలంగాణ సాధించుకున్నారన్న విషయం రాహుల్ గుర్తుంచుకోవాలని నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను చంద్రశేఖర్ రావు ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని, గత ఏడేళ్లుగా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వివిధ రంగాలలో అందుతున్న అవార్డులే దీనికి సాక్ష్యమన్నారు నిరంజన్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తెలిపారు.

బీజేపి కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలు.. రాహుల్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరన్న నిరంజన్
అంతే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యవసాయ రంగం పట్ల ఒక విధానం, ప్రణాళిక లేదని, పంజాబ్ లో కాంగ్రెస్ మోసాలకు విసిగి ప్రజలు ఇటీవల ఎన్నికలలో ఓడించారని, 2004 నుండి 2019 వరకు అమేథి పార్లమెంటు స్థానం నుండి రాహుల్ గాంధీకి ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే నిర్లక్ష్యం చేశారని, 2019లో ప్రజలు అమేథిలో ఓడించి రాహుల్ ను తరిమికొట్టారన్నారు నిరంజన్ రెడ్డి. ఐదోతరం వ్యక్తిగా కాంగ్రెస్ లో ఉన్న రాహుల్ కుటుంబపాలన, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీ నుండి యాత్రికుడిగా వచ్చిన రాహుల్ నాలుగు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమన్నారు నిరంజన్ రెడ్డి.












Click it and Unblock the Notifications