నయీం ఎన్కౌంటర్ ఎందుకు, మోడీకి కేసీఆర్ కానుకా: అమిత్ షాని లాగారు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ నేపథ్యంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నయీంతో మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని, అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా నల్గొండ జిల్లాలో పలువురు నాయకులకు నయీం అండ ఉందనే వాదనలు వినిపించాయి.
తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నయీం ఎన్కౌంటర్ ఇష్యూలోకి మధుయాష్కీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను లాగారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు చురకలు అంటించారు.
మధుయాష్కీ మాట్లాడుతూ.. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా ఇచ్చారా అని గురువారం ప్రశ్నించారు.
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్లో నయీం ప్రత్యక్ష సాక్షి అని, ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నిందితుడు అని, అమిత్ షాను కేసు నుంచి బయటపడేసేందుకే ప్రత్యక్ష సాక్షిని అడ్డు తప్పించారా అనే సందేహం కలుగుతోందన్నారు. నయీం బహిరంగంగా తిరుగుతున్నా, తెరాస నేత సంబశివుడిని హత్య చేసినా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందో చెప్పాలన్నారు.