కేసీఆర్ కొత్త "పావులు"- కాంగ్రెస్ అలర్ట్, రంగంలోకి రాహుల్..!!
తెలంగాణలో మరి కొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తమదే గెలుపని పార్టీలు పైకి ధీమా వ్యక్త చేస్తున్నా..లోలోపల మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగిన పోరుతో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసాయి. బీఆర్ఎస్ నిజమైన ఫలితాల్లో తమదే గెలుపని ధీమాగా ఉంది. ఈ సమయంలోనే కేసీఆర్ గేమ్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ అలర్ట్ అయింది. నేరుగా పార్టీ నాయకత్వం హైదరాబాద్ లో మొహరిస్తోంది. రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు.
ఫలితాలపై ఉత్కంఠ : తెలంగాణలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారు. కొద్ది గంటల్లోనే దీని పైన స్పష్టత రానుంది. కాంగ్రెస్ కే అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ మాత్రం విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. పార్టీ నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ సరళి పైన సుదీర్ఘ కసరత్తు..విశ్లేషణల తరువాత తాము అధికారంలోకి రాబోతున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ తాము ఖచ్చితంగా 70 సీట్లకు పైగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఈ సమయంలో హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ ఉందనే అంచనాలు రెండు పార్టీల్లోనూ టెన్షన్ పెంచుతున్నాయి. అదే జరిగితే బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్దులు కీలకం కానున్నారు.

కేసీఆర్ కొత్త లెక్కలు : అధికారానికి కావాల్సిన 60 స్థానాలకు కొద్ది దూరంలో ఆగినా..సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరితో కేసీఆర్ టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పార్టీ అభ్యర్దులను వెంటనే హైదరాబాద్ రావాలని సూచించింది. ఏఐసీసీ పెద్దలు హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలాకు..టి.కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్న డీకే శివకుమార్ పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే వరకు ఇక్కడే ఉండనున్నారు. కేసీఆర్ ఎత్తుగడలను..వ్యూహా లను కాంగ్రెస్ నిశితంగా గమనిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కాంగ్రెస్ అలర్ట్ : దీంతో..రాజకీయంగా రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా మేజిక్ ఫిగర్ కు సమీపంలో నిలిచిపోతేనే అసలు సమస్య మొదలవుతోంది. బీజేపీ, ఎంఐఎం కీలకంగా మారుతాయి. బీజేపీ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కు దూరంగా ఉంది. ఎంఐఎం అవసరమైనే బీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ఇలాంటి సమయాల్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతారనే అంచనాలతో కాంగ్రెస్ అన్ని రకాలుగా అప్రమత్తం అవుతోంది. దీంతో, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. కౌంటింగ్, ఫలితాలు..గెలిచిన తరువాత సీఎల్పీ సమావేశం.. హంగ్ పరిస్థితే ఏర్పడితే ఏం చేయాలనే దాని పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications