పోలీసు స్టేషన్ కు వచ్చి కొడతా - కాలర్ పట్టుకొని ఎస్సైని గుంజి : రేణుకా చౌదరి వార్నింగ్..!!
కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రాహుల్ గాంధీ - ఈడీ విచారణను నిరిసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. మరోసారి శుక్రవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి నిరసనగా టీపీసీసీ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఉదయం నుంచే రాజ్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు..పార్టీ కార్యకర్తలు ఛలో రాజ్ భవన్ లో పాల్గొనేందుకు తరలి వచ్చారు. దీంతో పోలీసు బలగాలు సైతం భారీగా మొహరించారు. పార్టీ శ్రేణులు ఆందోళనలో భాగంగా బస్సు అద్దాలు ధ్వంసం చేసారు. ఒక ద్విచక్ర వాహనం తగుల బెట్టారు.
Recommended Video
ఎస్సై కాలర్ పట్టుకొని గుంజి
దీంతో..మరింత బలగాలను పోలీసు అధికారులు మోహరించారు. పలువురు పార్టీ నేతలను అరెస్ట్ చేసారు. ఆ క్రమంలో రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీసుల పైన తిరగబడ్డారు. రాజ్ భవన్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసుల పైన విరుచుకుపడ్డారు. దీంతో..అక్కడే ఉన్న పంజాగుట్ట స్టేషన్ ఎస్సై ఉపేంద్ర కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి ముందుకు గుంజి..వార్నింగ్ ఇచ్చారు. స్టేషన్ కు వచ్చి కొడతానంటూ ఎస్సై పైన శివాలెత్తారు. తనను అడ్డుకోవటానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్స్ ను నెట్టవేస్తూ...వారిని హెచ్చరించారు.
భట్టి విక్రమార్క అరెస్ట్ సమయంలోనూ
దీంతో..అక్కడకు చేరుకున్న డీసీసీ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసారు. ఒక దశలో ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డు పైనే బైఠాయించారు. భట్టి విక్రమార్క అరెస్ట్ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్ భవన్ వైపు దూసుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను నియంత్రించటానికి పోలీసులు లాఠీలను ఉపయోగించారు. భట్టి అరెస్ట్ సమయంలో పోలీసులతో పెనుగులాట చోటు చేసుకుంది. శ్రీధర్ బాబు.. జగ్గారెడ్డి...గీతారెడ్డి..పీసీసీ చీఫ్ రేవంత్ తో సహా రేణుకా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసారు.
కార్యకర్తల అరెస్ట్.. ఉద్రిక్తత
కాంగ్రెస్ ఆందోళనతో పంజాగుట్ట..ఖైరతాబాద్.. బేగంపేట పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటే భట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు. రేణుకా చౌదరి విధులు నిర్వహిస్తున్న పోలీసులతో అనుచితంగా వ్యవహరించారంటూ కేసు నమోదు చేయనున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో సీఎల్పీ నేత భట్టి సైతం పోలీసులతో అనుచితంగా వ్యవహరించారంటూ కేసు నమోదు కానున్నట్లు సమాచారం.