డీఎస్ రాక ఎఫెక్ట్, అందుకే తెరాసలోకి సురేష్ రెడ్డి: రాజ్యసభ హామీ!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన దాదాపు తెరాసలో చేరారు. అధికారికంగా మాత్రం త్వరలో చేరనున్నారు. ఇప్పటికే 105 మందికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు.
కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం
దీంతో సురేష్ రెడ్డికి టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఆయన కూడా స్వయంగా చెప్పారు. ఇప్పటికే టిక్కెట్లు కేటాయించారని, కాబట్టి తాను రాజకీయ ప్రయోజనాల కోసం చేరుతున్నానని అనుకోవద్దని చెప్పారు. అయితే ఆయనకు కేటీఆర్ మంచి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
తెరాస తిరిగి అధికారంలోకి వస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ హామీతోనే ఆయన కారు ఎక్కారని అంటున్నారు. ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చారనే ప్రచారమూ సాగుతోంది.
సురేష్ రెడ్డి ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో ఆయన తెరాస తీర్థం పుచ్చుకుంటారు. ఆయన 1989 నుంచి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నుంచి వరసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో శాసన సభాపతిగా ఎన్నికయ్యారు. తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తెరాస రాజ్యసభ సభ్యుడైన డి శ్రీనివాస్ను తిరిగి కాంగ్రెస్లోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని సురేష్ రెడ్డి దానిని వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. ఆయనలోని అసంతృప్తిని గమనించిన కేటీఆర్.. కేఆర్ సురేష్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆహ్వానం పలికారు.