'కేసీఆర్ ఆలోచన వెనుక పెద్ద కుట్ర..వ్యతిరేకత తెలిసే కొత్త పథకాలు'
బీసీ విద్యార్థులకు గొర్రెలు, పందులు ఇవ్వడం కాదని, మంచి విద్యను అందించేలా చూడాలని వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగించే బీసీ కులాలకు జీవనోపాధి అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రతిపక్షాల విమర్శలకు గురవుతున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సీఎం కేసీఆర్ బీసీలపై ప్రేమ కురిపిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
కాగా, గత నెల జరిగిన కలెక్టర్ల సదస్సులో బీసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కుటుంబ జీవన స్థితిగతులను అంచనా వేసి వారికోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా కుల వృత్తులను నమ్ముకుని జీవించేవారికి ప్రభుత్వం అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది.
గొర్రెలు, చేపలు పెంపకంతో పాటు, సెలూన్లు, హైజనిక్ లాండ్రీల ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత వీహెచ్ గత కొద్దికాలంగా దీనిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి స్పందించిన ఆయన.. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు.
బీసీ విద్యార్థులకు గొర్రెలు, పందులు ఇవ్వడం కాదని, మంచి విద్యను అందించేలా చూడాలని వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ప్రారంభమైందని, ఈ విషయం తెలిసినందువల్లే కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను తెరమీదకు తెస్తున్నారని అన్నారు.
బీజేపీ-టీఆర్ఎస్.. ఈ రెండు పార్టీల వ్యవహార శైలి ఒకటేనని, బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుంటే, టీఆర్ఎస్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు.