బాబును కేసీఆర్ ఆదర్శంగా తీసుకుంటారా?: గాంధీ విగ్రహా ఎదుట వీహెచ్ మౌనదీక్ష
హైదరాబాద్: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి మద్దతుగా హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద ఆయన శుక్రవారం మౌనదీక్షకు దిగారు.
దీక్షకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో తాను అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు మౌనదీక్షకు దిగి ప్రభుత్వ వైఖరికి నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు.

ఏపీలో ఆలయాల కూల్చివేత ఘటనపై కూడా వీహెచ్ స్పందించారు. ఏపీలో కృష్ణా పుష్కరాల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు గుళ్లు, గోపురాలు కూల్చేస్తూ, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని వీహెచ్ విమర్శించారు. చార్మినార్ పాతదైందని కూలగొట్టడానికి కేసీఆర్, చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.
ఇక వీహెచ్ దీక్షకు హాజరైన పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు గుళ్లు తొలగించడం చంద్రబాబు ప్రభుత్వానికి సరికాదన్నారు. హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాదుల చర్యలను సరైన సమయంలో ఎదుర్కొన్న పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications