బీజేపీలోకి విజయశాంతి!: ముహూర్తం ఖరారు. సంకేతాలిచ్చిన ఫైర్బ్రాండ్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి.. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అంతేగాక, తాజాగా, విజయశాంతి చేసిన ట్వీట్ ఇందుకు బలాన్నిస్తున్నాయి.
బీజేపీలోకి విజయశాంతి..? ముహూర్తం ఖరారు..
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. కాగా, నవంబర్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో విజయశాంతి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విజయశాంతితో భేటీ అయిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కూడా కొద్ది రోజుల క్రితం విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తగిన గుర్తింపు లభించడం లేదని అన్నారు.
విజయశాంతి సొంతగూటికే.. పాత పరిచయాలు
కాగా, విజయశాంతి రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అదే పార్టీలోకి చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం.. అటు ఆ పార్టీకి, ఇటు ఈమెకు కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీలో విజయశాంతి కీలక పాత్ర..
గతంలో బీజేపీ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తరచుగా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై విజయశాంతి పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా మారుతుండటంతో ఆ పార్టీ వైపు విజయశాంతి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలోనే విజయశాంతి బీజేపీలో చేరి కీలక పాత్ర పోషించాలని చూస్తున్నట్లు సమాచారం.
Recommended Video
సంకేతాలిచ్చిన విజయశాంతి
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి... ఇంకొందరిని భయపెట్టి... ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి' అని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. అయితే, ఈసారి కాంగ్రెస్ నేత అంటూ పేర్కొనకపోవడం గమనార్హం.