దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదు... కేసీఆర్పై విజయశాంతి ఫైర్...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా వరద సాయాన్ని జాప్యం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు వరదసాయం పేరుతో దొరగారి సర్కార్ ఓట్ల రాజకీయానికి పాల్పడిందన్నది కాదనలేని సత్యమన్నారు. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు గడిచిపోయినా.. తెలంగాణ సర్కార్ ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయిందన్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... వరద సాయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనం కంటే... గ్రేటర్ ఎన్నికట్లో ఓట్ల కోసమే వరద సాయాన్ని ఆలస్యం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందాలన్న టీఆర్ఎస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి... ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపేయాల్సిందిగా ఆదేశించిందన్నారు. కానీ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల వరద సాయానికి బ్రేక్ పడిందనడం 'ఆడలేక మద్దెల ఓడు' అన్నట్టుందన్నారు.

ఇప్పటికే ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైందన్నారు. టీఆర్ఎస్ నేతలు సూచించినవారికి మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి నిజమైన బాధితులను విస్మరించారన్నారు.ఎన్నికలకు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని... మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి... ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారని విజయశాంతి ఆరోపించారు. వరద సాయం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ హడావుడి గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించారు.
Recommended Video
కాగా,తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ వరద సాయం నిలిపివేయడానికి ప్రతిపక్ష బీజేపీనే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరద సాయాన్ని నిలిపివేయాల్సిందిగా ఈసీ లేఖ రాయడం వల్లే ఇలా జరిగిందన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను సంజయ్ ఖండించారు. ఈసీకి తాను లేఖ రాయలేదని... తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. వరద సాయాన్ని ఆపింది బీజేపీ అని నిరూపించగలరా అని ప్రశ్నించారు.దీనిపై భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications