మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది - అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరింది...!!
మునుగోడులో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఓటమి పాలైంది. డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ తెలంగాణలో జోడో యాత్రలో ఉన్న సమయంలోనే మునుగోడులో పార్టీ ఓడిపోయింది. కానీ, అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరింది. మునుగోడులో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించిన వెంటనే తొలుత కాంగ్రెస్ ప్రచారంలోకి దిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ మునుగోడులో సభ ఏర్పాటు చేసి రాజగోపాల్ పైన విరుచుకుపడ్డారు.
ఆ తరువాత కాంగ్రెస్ అభ్యర్దిగా అనేక తర్జన భర్జనల తరువాత స్రవంతిని ఎంపిక చేసారు. ప్రచారంలో పాల్గొన్న రేవంత్ ప్రధానంగా రాజగోపాల్ ను టార్గెట్ చేసారు. కాంట్రాక్టు కోసమే పార్టీ మారారంటూ ఆరోపించారు. ఇక, అభ్యర్ది స్రవంతి మహిళా సెంటిమెంట్ పండించారు. మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. అదే సమయంలో రాహుల్ జోడో యాత్ర తెలంగాణకు చేరింది. పార్టీ ముఖ్య నేతలు రాహుల్ ను అనుసరించారు. కొందరు నేతలు మాత్రమే మునుగోడు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం సమయంలోనే కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని నేతలకు అర్దమైపోయింది.
దీంతో, తాము గెలవకపోయినా..రాజగోపాల్ మాత్రం గెలవకూడదనే వ్యూహం అమలు చేసారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు అక్కడ పట్టు ఉన్న ప్రాంతాల పైన ఫోకస్ చేసారు. తాము జత కట్టాలని కోరుకున్న వామపక్ష పార్టీలతో కేసీఆర్ అనూహ్యంగా పొత్తు ఖరారు చేసుకొని దెబ్బ కొట్టారు.అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వ్యవహారం కాంగ్రెస్ కు అస్త్రంగా మారింది. కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా రాజగోపాల్ వెనుక వెళ్లకుండా కాపాడుకోవటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. కానీ, కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో మాత్రం పార్టీ అభ్యర్ధికి ఓట్లు పోల్ కాలేదు.
టీఆర్ఎస్ - బీజేపీ రెండు పార్టీలు డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నాయని.. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవని, ఓడిపోయే పార్టీ కోసం ప్రచారం ఎందుకని కాంగ్రెస్ పార్టీ పైన ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేసారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ గెలుస్తారంటూ వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. కానీ, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకున్నది జరగలేదు. ఇదే ఇప్పుడు రేవంత్ తో సహా టీపీసీసీ నేతలకు కావాల్సింది. అదే ఇప్పుడు జరిగింది. దీంతో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.