హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి -సస్పెన్స్ కంటిన్యూ : తుది రేసులో ముగ్గురు - ఫైనల్ గా ఎవరంటే..!!
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్... బీజేపీ అభ్యర్దులు ఖరారు అయ్యారు. ఇప్పటికే ప్రచారంలో హోరా హోరీగా దూసుకు పోతున్నారు. కానీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్ధి ఖరారు కాలేదు. ఇప్పటికే రేసులో వెనుకబడి ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ గా నియమితులైన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావటంతో ఆయన సమర్ధతకు ఇది పరీక్షగా మారింది. దీంతో..ఇక ఆలస్యం చేయకుండా ముందుగా అభ్యర్ధి ఎంపిక పైన ఫోకస్ పెట్టారు. అందు కోసం అధిష్ఠానంతో చర్చలు ప్రారంభించారు.
మరింత ఆలస్యం చేయకుండా ఈ రోజు ఫైనల్ చేయాలంటూ ప్రతిపాదించారు. అందులో భాగంగా ముగ్గురి పేర్లు సూచించారు. కొద్ది రోజుల క్రితమే హుజూరాబాద్ బై పోల్ లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా సురేఖ పేరు దాదాపు ఖరారు చేసారు. అయితే, సురేఖ నుంచి తాను హుజూరాబాద్ లో పోటీ చేయాలంటే కొన్ని కండీషన్లను పార్టీ అధినాయకత్వం ముందు ఉంచారు. అందులో భాగంగా.. తాను ఈ ఎన్నికల్లో గెలిచినా- ఓడినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను సూచించిన వారికే భూపాలపల్లి, వరంగల్, పరకాలల్లో రెండు నియోజకవర్గాలను కేటాయించాల్సిందగా ఆమె కోరుతున్నట్లు చెబుతున్నారు.
దీంతో..సురేఖ కండీషన్లను అంగీకరించే ముందు వరంగల్ జిల్లా నేతలతో టీపీసీసీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. అదే సమయంలో సురేఖ ను తీసుకొచ్చి హుజూరాబాద్ లో పోటీ చేయటం ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయ.. పార్టీ పైన పడే ప్రభావం పైన సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన అభ్యర్ధులు బరిలో నిలిపితే ..టీఆర్ఎస్ - బీజేపీ నుంచి బలమైన అభ్యర్ధులు ఉండటంతో ఇబ్బంది ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పాటుగా అక్కడ ఇప్పటికే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించింది.
అదే విధంగా ఈ నియోజకవర్గానికి చెందిన పలువురికి కీలక పదవులు అప్పగించింది. అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్థానికంగా మంచి పరిచయాలు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో బీజేపీ నుంచి అభ్యర్దిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు నియోకవర్గంలో పూర్తిగా పట్టు ఉంది. దీంతో పాటుగా ఆయనను టార్గెట్ చేసి మంత్రి పదవి నుంచి తప్పించారంటూ సానుభూతి సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా రెండు నెలల క్రితం నుంచే వీరిద్దరూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇక, ఇప్పుడు కాంగ్రెస్ తమ అభ్యర్ధిని ఎంపిక చేయటమే మరింత ఆలస్యం చేస్తే నష్టం తప్పదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు రాత్రి లోగా ఎంపిక అభ్యర్ధి పైన నిర్ణయం తీసుకోకుంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్.. రాష్ట్ర నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించి అక్టోబరు మొదటి వారంలో అభ్యర్థిని ప్రకటించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. మెదక్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశానికి వచ్చి అక్టోబరు 2న విద్యార్థి, నిరుద్యోగుల సైరన్ కార్యక్రమం ప్రారంభోత్సవం వరకూ హైదరాబాద్లోనే ఠాగూర్ ఉంటారు.
హుజూరాబాద్ అభ్యర్థి నిర్ణయంలో ప్రతిష్ఠంభన కొనసాగితే.. ఈ మధ్యలోనే ఆయన పార్టీ నేతలతో మాట్లాడి అధిష్ఠానానికి సింగిల్ పేరును సూచించనున్నట్లు చెబుతున్నారు. చివరగా కొండా సురేఖ పేరు ఫైనల్ అవుతుందని .. అయితే, అందరి అభిప్రాయాలు స్వీకరించి.. సురేఖ అభ్యర్దిత్వం పైన ఒప్పించి నిర్ణయం ప్రకటించే విధంగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల కు సమయం ఉంది. అయితే, ముందుగా అభ్యర్ధిని ఖరారు చేయటం ద్వారా ప్రచారానికి మరింత సమయం దొరుకుతుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు.