తెరాసలో చేరట్లేదు: వివేక్, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా..
హైదరాబాద్: వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరిని తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన త్వరలో రాజీనామా చేసే అవకాశాలున్నాయి. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తద్వారా కడియంను ఎమ్మెల్సీగా చేయనున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన వరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తారు.
ఈ నేపథ్యంలో వరంగల్ లోకసభకు జరిగే ఉప ఎన్నిక పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ జీ వివేక్ తెరాసలోకి వస్తారని, ఆయనను తెరాస వరంగల్ నుండి పోటీ చేయించవచ్చుననే ప్రచారం సాగింది.
దీని పైన మరో కోణం కూడా వినిపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీయే జీ వివేక్ను వరంగల్ లోకసభ స్థానం బరిలో నిలపాలనకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ తీరు పైన ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, దీనిని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయంటున్నారు. కేసీఆర్ పైన ప్రజల అసంతృప్తిని వరంగల్ లోకసభ స్థానం గెలుచుకోవడం ద్వారా చూపించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉబలాటపడుతున్నాయంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జీ వివేక్ను వరంగల్ బరిలో దింపనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాల పైన వివేక్ మాట్లాడుతూ.. తాను తెరాసలో చేరేది లేదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. వరంగల్ లోకసభకు తన పేరును పరిశీలిస్తున్నట్లుగా వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. దీనిపై పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. వరంగల్ లోకసభ అభ్యర్థి గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నారు.