హైదరాబాద్లో కన్నుమూసిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్సభ సభ్యుడు వసంత్ రావ్ బల్వంత్ రావ్ చవాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్రలోని నాందెడ్ లోక్సభ నియోజకవర్గానికి వసంత్ చవాన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతాప్ రావ్ గోవింద్ రావ్ చిఖలికర్ను 50 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. ఆయన స్వస్థలం నయీగావ్. లోక్సభకు ఎన్నిక కాకముందు నయీగావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

కొంతకాలంగా వసంత్ చవాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాందెడ్లో చికిత్స తీసుకున్నారు. మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి హైదరాబాద్కు వచ్చారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. మరింత విషమించింది. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణం పట్ల మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించింది. ఈ మేరకు మహారాష్ట్ర పీసీసీ అధినేత నానా పటోలే ఓ ప్రకటన విడుదల చేశారు.
వసంత్ చవాన్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉన్నారని నానా పటోలే అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ మొత్తం అండదండగా ఉంటుందని పేర్కొన్నారు. వసంత్ చవాన్ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications