కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్... ప్రస్తుతం ఐసోలేషన్లో....
ఎంపీ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని రేవంత్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇటు తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటివరకూ తక్కువ సంఖ్యలో కేసులు నమోదవగా... ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీలు పురాణం సతీశ్,దామోదర్ రెడ్డిలు కరోనా బారినపడ్డారు. గడిచిన 4 గంటల్లో కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. ఇప్పటివరకూ 2,99,042 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం 3,151 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో 1285 మంది హోం క్వారెంటైన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 1,674గా ఉంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో 10వ తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేస్తే మంచిదని రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి,రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు స్కూళ్లలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions...
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా అన్న చర్చ కూడా మొదలైంది.అయితే ఆ ప్రతిపాదనలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్,రాత్రిపూట కర్ఫ్యూ ప్రతిపాదనలేవీ లేవని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని... అర్హులైనవారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.