ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తుది జాబితా విడుదల: అద్దంకి, నీలంకు షాక్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ గురువారం రాత్రి తుది జాబితాను విడుదల చేసింది. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్ ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
కాగా, అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగడం గమనార్హం. పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించి సర్వేల నివేదికలు తెప్పించుకుని అభ్యర్థులను ఖరారు చేశారు.

పటాన్చెరు నుంచి నీలం మధు ముదిరాజ్ను తొలుత అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. బీఫాం ఇవ్వకుండా నిలిపివేశారు. ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలిచారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు చివరికి పటాన్ చెరు టికెట్ ను కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించారు.
మరోవైపు, తుంగతుర్తి నుంచి టికెట్ కోసం అద్దంకి దాయకర్ చివరి వరకు రేసులో ఉన్నప్పటికీ.. ఆ స్థానాన్ని మందుల శామ్యూల్కు ఇవ్వడం గమనార్హం. తాను కాంగ్రెస్ పార్టీ బీఫాం తీసుకుని శుక్రవారం తుంగతుర్తిలో నామినేషన్ దాఖలు చేస్తానని అద్దంకి దయాకర్ గురువారం చెప్పడం గమనార్హం. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనకు టికెట్ కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అద్దంకి స్పందన ఇదే
తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా, రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామన్నారు. తనకు టికెట్ కేటాయించలేదని పార్టీ శ్రేణులు బాధపడవద్దని కోరారు అద్దంకి దయాకర్.












Click it and Unblock the Notifications