రాహుల్ గాంధీ సభ సక్సెస్ కోసం.. రంగంలోకి రేవంత్ రెడ్డితో పాటు హేమాహేమీలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపనున్నారు.
హన్మకొండలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న సభా స్థలిని పరిశీలించనున్న టీపీసీసీ
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న రాహుల్ గాంధీ వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిపిసిసి సభ ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేయడం కోసం క్షేత్రస్థాయిలో సభాస్థలి పరిశీలించి, సభ ఏర్పాట్లను చేయనున్నారు.
వరంగల్ కు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు
ఈ నెల 22వ తేదీన వరంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరగనున్న రాహుల్ గాంధీ సభాస్థలి ని పరిశీలించనున్నారు. రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయడం కోసం క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి రంగం లోకి దిగుతున్న పీసీసీ ముఖ్య నాయకులు సభాస్థలి పరిశీలన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో సమీక్ష జరపనున్నారు.
సభకు ఎంత మంది హాజరు అవుతారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు ఎలా చెయ్యాలి. సభకు సంబంధించిన అనుమతులు తదితర అన్ని విషయాలపై కూలకుషంగా చర్చించనున్నారు.
రాహుల్ గాంధీ సభ నేపధ్యంలో సన్నాహక సమావేశాలు
ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని జిల్లా నాయకులతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్ లో జరగనున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సభ విషయంలో ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
రాహుల్ గాంధీ సభ సక్సెస్ చెయ్యటమే లక్ష్యం
టిపిసిసి, పిఎసి, డిసిసి అనుబంధ సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ లు, ముఖ్య నాయకులతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయడం కోసం ఇప్పటి నుంచే సన్నాహక సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణులలోనూ జోష్ నింపుతోంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం.