ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితుడైన రేవంత్ రెడ్డి ఉన్నారు.
బాబు మోహన్కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో పాటు రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. పొత్తులపై వీరు చర్చలు జరపనున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు
ఇప్పుడు రేవంత్ రెడ్డికి కమిటీలో చోటు దక్కింది. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి పలు కారణాలు ఉన్నాయి. రేవంత్ కాంగ్రెస్లో చేరినప్పటికీ చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందే చంద్రబాబు అని కొందరు అనుమానిస్తున్నారు. అలాంటి రేవంత్ పొత్తుల కమిటీలో ఉండటంతో టీడీపీతో పొత్తు ఖాయమనే వాదనలకు మరింత బలం చేకూరుతోంది.
రాహుల్ గాంధీ సన్నిహితుడు యాష్కీకి చోటు
మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చాలా సన్నిహుడైన మధుయాష్కీ కూడా ఈ కమిటీలో ఉన్నారు. చంద్రబాబుకు రేవంత్తో అనుబంధం ఉండగా, రాహుల్తో యాష్కీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అధినేతలను వీరిద్దరు ఒప్పించగలరు అని చెబుతున్నారు. అసలు ఇప్పటికే పొత్తు తేలిపోయిందని, ఈ కమిటీ కేవలం పైకి మాత్రమే అంటున్నారు.
పొత్తుతో కాంగ్రెస్లో చిచ్చు
టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల చిచ్చు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే టిక్కెట్ల గొడవ ఉంటుంది. ఇక టీడీపీ కలిస్తే, ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే కాంగ్రెస్కు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవని అంటున్నారు. పొత్తులపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అంతర్గత సమావేశంలో నిలదీస్తున్నారని తెలుస్తోంది.
పొత్తు ఉంటే మాకు చెప్పాలి
శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు పొత్తులపై నిలదీశారు. పొత్తులు ఉంటే ముందే చెప్పాలని, అలాగే పొత్తు పెట్టుకునే పార్టీలకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితుల్లో స్థానిక ఇంచార్జులను ఒప్పించాలని పలువురు నేతలు సూచించారు. తమకు చెప్పకుండా టిక్కెట్లు కేటాయించవద్దని పలువురు సీనియర్లు కోరారు. అయితే పొత్తులపై చర్చలు ఇంకా మొదలు కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.