ప్రజాక్షేత్రంలో పోరాటాలకు కాంగ్రెస్ రెడీ: ఏప్రిల్1 నుండే ఆందోళనలు; రాష్ట్రానికి రాహుల్ గాంధీ!!
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దింపటమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ తెలంగాణా ప్రభుత్వంపై యుద్ధం సాగిస్తుంది. తెలంగాణా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎండగట్టే పనిలో ఉంది. ఈ మేరకు ఏప్రిల్ నెలలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇకతాజాగా జాతీయ నాయకత్వంతో చర్చ తర్వాత కాంగ్రెస్ కూడా ప్రజా సమస్యల కోసం ఆందోళనలతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీలో కీలక చర్చ
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. 25 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు తోపాటు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణను చర్చించినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే క్రమంలో ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర నేతలతో మరోమారు రాహుల్ గాంధీ భేటీ కానున్నారు అని వెల్లడించారు. రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి రావాలని విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించారని, రాహుల్ గాంధీ వచ్చే అవకాశమున్నట్లు గా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వరి ధాన్యం కొనుగోలు పై పోరాటం చేస్తామన్న రేవంత్ రెడ్డి
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వరి ధాన్యం కొనుగోలు పై పోరాటం చేస్తామని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్న ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండు లక్షల ప్రమాద భీమా ఇవ్వనున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై , ప్రజాక్షేత్రంలో పార్టీ చేయాల్సిన పోరాటాల పై చర్చించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాట పంధాను కొనసాగించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు.
ప్రజాసమస్యలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉధృతంగా పోరాటాలకు కాంగ్రెస్ రెడీ
ధాన్యం కొనుగోలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి జనంలోకి తీసుకెళ్తామని రేవంత్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయని, రైతుల మరణాలకు కారణమవుతున్నాయి అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టామని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రజాసమస్యలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సైతం ప్రజా క్షేత్రంలో పోరాటం చేయడానికి సిద్ధమైంది. తదనుగుణంగా కార్యాచరణను రూపొందించి ఏప్రిల్ 1వ తేదీ నుండి రంగంలోకి దిగనుంది.