టీఆర్ఎస్కు గెలవలేమన్న భయం.. వాళ్ల విమర్శలకు స్పందించాల్సిన స్థాయి కాదు.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్నకొద్ది టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా,సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి సాగర్ అభివృద్దికి చేసిందేమీ లేదని టీఆర్ఎస్ విమర్శిస్తుంటే... అదంతా గోబెల్స్ ప్రచారమని జానారెడ్డి కొట్టిపారేస్తున్నారు. సాగర్ అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ నేతలు, మంత్రుల వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు. టీఆర్ఎస్ నేతల విమర్శలకు స్పందించాల్సిన స్థాయి తనది కాదని చెప్పారు.
టీఆర్ఎస్కు గెలవలేమన్న భయం..: జానారెడ్డి
సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి అన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా సాగర్లో గెలవలేమన్న భయంతోనే... తనపై అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా,ప్రజలను ప్రలోభ పెట్టకుండా ఎన్నికలకు రావాలని ప్రతిపాదన చేస్తే ఇంతవరకూ టీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ప్రతిపాదన చేశానని చెప్పారు. కానీ టీఆర్ఎస్ మాత్రం అందుకు వెనకడుగు వేస్తోందన్నారు.
ప్రజలను ప్రలోభ పెడుతున్నారు : జానారెడ్డి
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా మద్యం పంపిణీతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తోందని జానారెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతల తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఉపఎన్నికలో తనదే విజయం నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పారు.
ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్
మరోవైపు సాగర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. దాదాపు ముగ్గురు మంత్రులు,12 మంది ఎమ్మెల్యేలు సాగర్లోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గడపగడపకూ వెళ్లి టీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు,రోడ్ షోలతో స్థానిక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్లో పరిస్థితి పూర్తిగా టీఆర్ఎస్కే అనుకూలంగా ఉందని... సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ ఇక్కడినుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా.... మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.