కాకా మళ్లీ వేశారుగా.. గవర్నర్పై వీహెచ్ హాట్ కామెంట్స్..!
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ అలియాస్ కాకా రూటే సెపరేటు. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలు.. ఎవరైనా ఏకిపారేస్తారు. చిన్నా, పెద్దా.. చుట్టమా గిట్టమా అవన్నీ కాకాకు జాన్తా నై. నోటికాడికి వచ్చిన మాటను అలా అనేస్తారంతే. ఇక సొంత పార్టీవారా, అవతలి పార్టీ వారా అనేది కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు. దుమ్ము దులపాలనుకుంటే దులిపేస్తారంతే. అదే క్రమంలో గవర్నర్ నరసింహన్పై హాట్ కామెంట్స్ చేశారు. ఇదివరకు చాలా సందర్భాల్లో కూడా ఆయనపై ఆరోపణాస్త్రాలు గుప్పించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. పనిలో పనిగా గవర్నర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదివరకు పలు సందర్భాల్లో గవర్నర్పై పలురకాల కామెంట్స్ చేసిన వీహెచ్.. తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రులకు భజన చేయడం, ఆలయాలకు వెళ్లడమే తప్ప గవర్నర్కు వేరే పనిలేదని వ్యాఖ్యానించారు.

త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని, ఆ విధంగా ప్రతిఫలం కోసం పోరాడాల్సిన అవసరముందన్నారు వీహెచ్. దళితులపై దాడులు జరిగినా, రైతులకు సంకెళ్లు వేసినా.. గవర్నర్ మాత్రం చూస్తూ ఉన్నారే తప్ప స్పందించిన దాఖలాలు లేవన్నారు. అసలు ఇలాంటి గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు.
గవర్నర్ నరసింహన్ను ఇక్కడి నుంచి తప్పించేలా.. కేంద్ర హోంశాఖ మంత్రిని కోరనున్నట్లు వీహెచ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగానే గవర్నర్ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications