టార్గెట్ రేవంత్... ప్రత్యర్థి చేతికి మళ్లీ 'సెంటిమెంట్' అస్త్రం... ఇరికిస్తున్న సొంత పార్టీ నేతలు
టీపీసీసీ కొత్త చీఫ్గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరకూ ప్రయత్నించి భంగపడ్డ సీనియర్లు... రేవంత్కు సహకరించడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే బాహాటంగా రేవంత్పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్న ఆ నేతలు... పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ విఫలమవ్వాలని కోరుకుంటున్నట్లు పరోక్షంగా వారి మాటల్లో ధ్వనిస్తోంది.
Recommended Video
రేవంత్కు సహకరించకపోగా... ప్రత్యర్థుల చేతికి అస్త్రాలను ఇచ్చేలా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ చంద్రబాబు మనిషి అని పదేపదే చెప్పడం ద్వారా... తెలంగాణపై మళ్లీ ఆంధ్రా నేతల కుట్రలు ఈ రూపంలో మొదలయ్యాయన్న అర్థం స్పురించేట్టు చేస్తున్నారు. ఒకరకంగా ఇది ప్రత్యర్థి చేతికి మళ్లీ సెంటిమెంటు అస్త్రాన్ని అందించడమే...

'రేవంత్కు పీసీసీ రావడంలో చంద్రబాబు పాత్ర'
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్ష పదవి రేవంత్కు దక్కడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కొత్త కార్యవర్గాన్ని చూస్తుంటే... ఇది టీడీపీ పీసీసీని తలపిస్తోందని విమర్శించారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ పార్టీ సీనియర్లు ఆయన్ను టీడీపీ మనిషిగానే చూస్తున్నారన్నది కోమటిరెడ్డి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. తొలి నుంచి రేవంత్తో కలిసి పనిచేసేందుకు సఖ్యత చూపని సీనియర్లు... ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. రేవంత్తో విబేధిస్తే దాన్ని అంతగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని ఉండకపోయేదేమో. కానీ రేవంత్ చంద్రబాబు మనిషి అని చెప్పే ప్రయత్నం చేయడం.. ఆయన కొత్త ప్రయాణానికి అతిపెద్ద ఆటంకం సృష్టించడమే.

ప్రత్యర్థి చేతికి అస్త్రం అందించినట్లే...
గత 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రూపంలో టీఆర్ఎస్కు సెంటిమెంట్ ఎలా కలిసి వచ్చిందో తెలిసిందే. మహాకూటమిలో టీడీపీ కూడా భాగస్వామి కావడంతో... తెలంగాణపై మళ్లీ ఆంధ్రా నేతల పెత్తనం తీసుకొచ్చేందుకే ఇక్కడి పార్టీలు ఆయనతో జతకట్టాయని టీఆర్ఎస్ విమర్శించింది. దాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది.
సెంటిమెంట్ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా... అది టీఆర్ఎస్కు కలిసొచ్చేదే. ఇప్పుడు రేవంత్ను చంద్రబాబు మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం మళ్లీ షురూ అవడం... భవిష్యత్తులో మళ్లీ సెంటిమెంటును రగిలించడానికి టీఆర్ఎస్కు దోహదం చేసే అంశమే. సొంత పార్టీ నేతలే రేవంత్ను ఇలా టార్గెట్ చేయడం ద్వారా ప్రత్యర్థుల పనిని వారు మరింత సులువు చేస్తున్నారనే చెప్పాలి.

దాని పైనే రేవంత్ రాజకీయ భవిష్యత్...
కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం లాంటిదని చెబుతారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని... స్వేచ్చా వాదనలకు స్పేస్ ఎక్కువగా ఉంటుందని అంటారు. రేవంత్ పీసీసీ ఎంపిక తర్వాత వినిపిస్తున్న వాదనలు కూడా దీన్ని చిత్రిక పడుతున్నాయి. అయితే కోమటిరెడ్డి లాంటి నేతల మాటలను గమనిస్తే... రేవంత్తో విబేధించడం కంటే ఆయన్ను శత్రువుగానే భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
కొత్త కార్యవర్గం తనను కలవడానికి ప్రయత్నించవద్దని ఆయన చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది. ఇలా సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న సవాళ్లను రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారన్న దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.

మున్ముందు ఇంకెంత వ్యతిరేకత...
మరోవైపు రేవంత్కు పీసీసీ ఇచ్చినందుకు తెలంగాణలోని టీడీపీ మద్దతుదారుల్లోనూ ఒకింత సంతోషం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ సీనియర్లకు మింగుపడటం లేదు.కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఓ టీవీ ఛానెల్ ఫోన్-ఇన్లో మాట్లాడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఆయన వ్యాఖ్యలను సమర్థించట్లేదని చెబుతూనే,తనతో పాటు పార్టీలో చాలామందికి ఇబ్బంది ఉందన్నారు.
మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. మున్ముందుకు ఇంకెంత మంది నేతలు రేవంత్పై వ్యతిరేక స్వరం వినిపిస్తారో తెలియదు. ఇంత ప్రతికూలత నడుమ రేవంత్ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.












Click it and Unblock the Notifications