TS assembly polls:బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దండ "యాత్ర"..యువతే టార్గెట్గా..!
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. పోలింగ్కు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచడమే కాదు.. ఆయా పార్టీలపై విమర్శలు కూడా అంతే స్థాయిలో ఎక్కుపెట్టాయి. తెలంగాణలో ప్రధానంగా పోటీ అధికారిక బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉన్నట్లు కనిపించినా.. ప్రస్తుతం మాత్రం మూడో స్థానానికే పరిమితమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇక డిజిటల్ క్యాంపెయినింగ్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అందివచ్చిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే అధికారిక బీఆర్ఎస్ వైఫల్యాలపై బాణం గురిపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రజల్లో కాంగ్రెస్ పేరు నిలిచిఉండేందుకు అన్ని అవకాశాలను హస్తం పార్టీ వినియోగించుకుంటోంది. ఇక కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ వివరిస్తోంది. ధరణి పోర్టల్, ఇతరత్రా వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లి మార్పురావాలంటే కాంగ్రెస్ రావాలంటూ నినదిస్తోంది. ఈ స్లోగన్ కూడా ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా వెల్లిందని కాంగ్రెస్ నాయకులు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఇక యువతను మేల్కొలిపే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ ప్రధానంగా ఫోకస్ చేసింది. నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనలపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తీసుకోబోయే చర్యలను వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా " నిరుద్యోగ ఎక్స్ప్రెస్ యాత్ర" పేరుతో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటిస్తారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ రియాజ్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక నిరుద్యోగ ఎక్స్ప్రెస్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రస్తుత కేసీఆర్ సర్కార్ అవలంబించిన తీరును వివరించనుంది. టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు వచ్చాక ఏ రకంగా ఆ పరీక్షలు మళ్లీ రద్దయిన తీరును, పేపర్ లీక్ వల్ల నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే అంతకంటే ముందుగా ఎన్నికల సంఘాన్ని సంప్రదించి యాత్రకు అనుమతి తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఒక బస్సు యాత్రం ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభించి అదే సమయంలో మరో బస్సు యాత్రను దక్షిణ తెలంగాణ నుంచి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ నిరుద్యోగ బస్సు యాత్ర నవంబర్ 15 లేదా 16వ తేదీన ప్రారంభించ యోచనలో హస్తం పార్టీ ఉంది.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రారంభించిన డిజిటల్ క్యాంపెయిన్ పై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాంగ్రెస్ డిజిటల్ క్యాంపెయిన్ లేదా యాడ్స్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రచారం చూసి భయపడి ఈసీకి ఫిర్యాదు చేసిందని హస్తం నేతలు చెబుతున్నారు. ఇలాంటివి ఎన్ని చేసిన వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఇప్పటికే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications