కాంగ్రెస్ టీఆర్ఎస్ రహస్య బంధం బయటపడింది.!అందుకు ఇదుగో సాక్షాలంటున్న డీకే అరుణ.!
హైదరాబాద్ : బీజేపి మొదటి నుండి వ్యక్తం చేస్తున్న సందేహాలు నేడు నిజం అయ్యాయన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయన్న తమ బీజెపి పార్టీ అనుమనాలు నేడు పటాపంచలు అయ్యాయని ప్రజలు ఇది గమనించాలన్నారు డీకే అరుణ. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు రెండు ఒకటేనని మరోసారి రుజువైందని డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన వ్యవహారం పై గురువారం మధ్యాహ్నం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ రెండు పార్టీలపై ధ్వజమెత్తారు.
బీజేపీ శాంతి యుతంగా నిరసనకు పిలుపునిస్తే ఒక్క రోజు ముందే గృహ నిర్భంధం చేసే పోలీసులు, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చలో రాజ్ భవన్ పిలుపిస్తే పోలీసులు వారిని కనీసం నియంత్రించ లేక పోయారని డీకే అరుణ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎవరికి ఈడీ నోటీసులు ఇవ్వలేదా, నోటీసులు అందుకున్న వారంతా ఇదే విధంగా దాడులు చేసారా అని డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే రాజ్ భవన్ పై దాడి చేయడానికి వెళ్లినట్టు ఉందని , దానికితెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్టు స్పష్టంగా అర్థమవుతుందని డీకే అరుణ దుయ్యబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల పై దాడులు చేసిన వారి పై కేసులు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.