హెచ్సీయూలో వివాదాస్పద మోడీ డాక్యుమెంటరీ కలకలం.. ఏబీవీపీ ఫిర్యాదుతో క్యాంపస్ లో టెన్షన్!!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియా.. ది మోడీ క్వశ్చన్ ను ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీ పాత్రను ఉటంకిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫిర్యాదు చేసింది. దీంతో హెచ్సీయూలో ప్రధాని నరేంద్ర మోడీ డాక్యుమెంటరీ కి సంబంధించిన రచ్చ కొనసాగుతుంది.
సెంట్రల్ యూనివర్సిటీలో మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శన.. విద్యార్ధి సంఘాల మధ్య రచ్చ
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బిబిసి ప్రధాని మోడీ పాత్ర పై ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని బ్లాక్ చేసింది. ఇదే సమయంలో ఈ వీడియోని బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ లను కూడా ఆదేశించింది. తర్వాత హైదరాబాద్ లోని హెచ్ సి యు క్యాంపస్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలకు కారణంగా మారింది.
యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు.. కొనసాగుతున్న దర్యాప్తు
ప్యాటర్నిటీ గ్రూప్స్ ఆయన స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించినట్టు యూనివర్సిటీ యాజమాన్యం గుర్తించింది. యూనివర్సిటీలో కావాలని కొంతమంది కల్లోలం రేపడం కోసం కేంద్రం బ్లాక్ చేసిన డాక్యుమెంటరీ ప్రదర్శించారని ఏబీవీపీ నాయకులు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ అధికారి యంత్రాంగం తమకు మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శించారని దానిపై ఫిర్యాదు అందిందని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.దీనిపై విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ..
ఇదిలా ఉంటే బీబీసీ చేసిన ఈ డాక్యుమెంటరీ ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయకముందే యూనివర్సిటీలో ప్రదర్శించారని పలువురు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు కూడా పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై పలు వర్గాల నుండి విమర్శలు వెల్లువగా మారాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో మోడీకి క్లీన్ ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ఇటువంటి డాక్యుమెంటరీ రూపొందించడం అటు యూకే లోను, ఇటు ఇండియాలోనూ తీవ్ర ఆగ్రహానికి కారణంగా మారింది. ఇక ఇదే డాక్యుమెంటరీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రచ్చ కొనసాగుతుంది.