బీఫ్ ఫెస్టివల్పై ఓయులో రగడ: ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ స్టూడెంట్స్
హైదరాబాద్: హైదరాబాద్లో ప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ వివాదం చెలరేగుతోంది. ఇది కాస్తా హైదరాబాద్ గోషామహల్ బిజెపి శాసనసభ్యుడు రాజాసింగ్కు, ఉస్మానియా విద్యార్థులకు మధ్య వివాదంగా మారింది. రాజాసింగ్పై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చూస్తున్నారని ఓయు విద్యార్థులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సోమవారం వారు మీడియాతో మాట్లాడారు.
ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని విద్యార్థులు చెప్పారు. ప్రజల ఆహారం అలవాట్లను బిజెపి ప్రభుత్వం నియంత్రించే ప్రయత్నం చేస్తోందని వారు విమర్సించారు. బీఫ్కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న చర్యలకు నిరసనగా ఓయు విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని తలపెట్టారు.
కాగా, బీఫ్ పెస్టివల్కు అనుమతి నిరాకరించాలని రాజా సింగ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ను కోరారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం చెడిపోతుందని ఆయన అన్నారు. ఉస్మానియాలో గతంలో కూడా బీఫ్ ఫెస్టివల్స్ జరిగాయి.