బాదుడే బాదుడు.. వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ పెంపు!!
కొత్తగా కాపురం పెట్టేవారికి, కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వరంగ చమురు సంస్థలు గట్టిగా షాకిచ్చాయి. గృహ అవసరాలకు ఉపయోగించే వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధరను భారీగా పెంచాయి. 14.2 కేజీల సిలిండర్ డిపాజిట్ ధర ప్రస్తుతం రూ.1450గా ఉంది. దాన్ని రూ.2200 చేశారు. అలాగే 5 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర కూడా పెంచారు. రూ.800 గా ఉండేదాన్ని రూ.1150 చేశారు. రెగ్యులేటర్ కావాలంటే ఇకనుంచి రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలు ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఉజ్వల యోజన వినియోగదారులకు పెరిగిన ధరలు వర్తించమని చమురు కంపెనీలు ప్రకటించాయి. గత నెలలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.3.50 పెరిగింది. కమర్షియల్ సిలిండర్ రూ.8 పెంచారు. రాయితీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,003కు చేరింది. నిత్యవసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామాన్యులకు ఇప్పటికే గ్యాస్ బండ గుదిబండగా మారింది. దాన్ని మరింత బండగా మారుస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
సిలిండర్ డిపాజిట్ ధర పెంపుపై కమ్యూనిస్టు పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ఫక్తు వ్యాపార ధోరణిలోకి మారిపోయాయని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవచేయడానికి మాత్రమే ఉన్నామనే విషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లుగా లేదని, వ్యాపారం చేస్తున్నట్లుగా ఉందంటూ మండిపడ్డాయి. పెరిగిన డిపాజిట్ ధరలు అమల్లోకి రాకముందే తగ్గించాలని, లేదంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.