కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ పైన జాగ్రత్తల మాట అటుంచి కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. ఎవరు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ అన్న భయం ప్రజలను వేధిస్తోంది. ఇక అందుకు తగ్గట్టు రోజురోజుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను టెన్షన్ పెడుతోంది.
లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్
గ్రామాలలో కొత్తవారు వస్తే అనుమానాలు
ఇక దీనితో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు కరోనా వైరస్ అంటే భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ భారతదేశంలోకి విదేశీయుల ద్వారా వచ్చిన నేపథ్యంలో విదేశీయులు ఎవరైనా గ్రామాల్లోకి వచ్చారు అంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాదు అటు పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ కొత్తవారు ఎవరైనా వస్తే వారి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాస్త ఆరోగ్యంగా కనిపించినా నిర్మొహమాటంగా గ్రామంలోకి అనుమతించని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గంగ్యాడ గ్రామస్తులకు కరోనా నేపధ్యంలో వింత అనుభవం
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గంగ్యాడ గ్రామానికి చెందిన 14 మంది విహారయాత్రకు వెళ్లి తిరిగి గ్రామంలో కి వచ్చిన నేపథ్యంలో వారికి వింత అనుభవం ఎదురైంది. గ్రామం విడిచి పెట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించి వచ్చినవారిని గ్రామస్తులు గ్రామంలోకి అనుమతించడం లేదు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కరోనా వైరస్ వారికి లేదని నిర్ధారిస్తే నే వారిని గ్రామంలోకి అనుమతిస్తామని చెప్తున్న పరిస్థితి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా భయానికి అద్దం పడుతుంది.
పెరుగుతున్న కరోనా భయం .. ప్రయాణాలు చేస్తే అంతే సంగతి
అసలే ఓవైపు కరోనా భయంతో వణికిపోతోన్న సమయంలో ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణాలు చేసి వస్తే నిర్మొహమాటంగా గ్రామాల్లోకి రావద్దు అని చెప్పడం ఒకరకంగా బాధ కలిగించినా, కరోనా వైరస్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకున్న తర్వాత, కరోనా నిర్ధారణ కాకుంటే, కరోనా ఎఫెక్ట్ వారికి లేకుంటే గ్రామాల్లోకి అనుమతిస్తామని చెప్పడం కాసింత ఊరట. మొత్తానికి కరోనా దేశవ్యాప్తంగా ప్రబలుతున్న తరుణంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిదనే భావన తాజా పరిణామాలతో వ్యక్తమౌతుంది.