తెలంగాణాను వణికిస్తున్న కరోనా; పెరిగిన యాక్టివ్ కేసులు; తాజా పరిస్థితి ఇలా!!
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసుల కలకలం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,245 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ గా తేలింది. ఇందులో 8 కేసులు హైదరాబాద్లో, ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదయింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 27 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జేఎన్-1 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమవుతున్నారు. వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి క్రమంలో వరంగల్ ఎంజీఎం వైద్యులు ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

భూపాలపల్లి నుండి వచ్చిన ఒక మహిళ కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు వరంగల్ ఎంజిఎం సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ దిశ నిర్దేశం చేశారు. 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన అధికారులు, 70కి పైగా కోవిడ్ వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
ఇక నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేసి, నాలుగు రోజులుగా అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు, టీకా కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు అధికారులు చెప్పారు. కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు మాస్క్ ధరించడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని సింగరేణి డైరెక్టర్ బలరాం సూచించారు.
విధులను నిర్వర్తించేటప్పుడు గుమికూడవద్దని సింగరేణి డైరెక్టర్ బలరాం చెప్పారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన 153 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఫయాజ్ ఖాన్ తెలిపారు. వారిలో ఎవరికీ కోవిడ్ నిర్దారణ కాలేదు కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications