కరోనా భయం: బస్సులో మృతి చెందిన వ్యక్తిని నడిరోడ్డుపై వదిలేశారు
హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో మనుషుల్లో భయం పెరిగి అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు. మానత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది.
తాండూరు నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, అతడి వెంట ఎవరూ లేకపోవడంతో.. డ్రైవర్, కండక్టర్ అమానవీయంగా ప్రవర్తించారు. కేరెల్లి గ్రామంలో బస్సును ఆపి మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. అతడు కరోనా కారణంగా మరణించాడా? లేక ఇతర ఆరోగ్య కారణాలతో చనిపోయాడా? అని తెలుసుకోకుండానే రోడ్డుపై వదిలేయడం గమనార్హం.

ఒకవేళ అతడు కరోనాతో మరణించినా.. పోలీసులకు సమాచారం ఇచ్చివుండాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో ఏ విషయం తెలియకుండా పోయింది. అతడు కరోనాతో మరణించినా.. ఆ బస్సులోని వారిని క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉండేది. అలా కూడా జరగలేదు. కాగా, అలా మృతదేహాన్ని రోడ్డుపై వదిలివేయడం నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల ఆంధ్రాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో దార్లోనే బస్సు ఆపేసి, అతడ్ని, అతడి భార్యను దింపి వెళ్లిన ఘటన మరువక ముందే తెలంగాణలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతిని కరోనా అనుమానంతో బస్సులోంచి తోసేయడంతో ఆమె మరణించింది.












Click it and Unblock the Notifications