తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్, సడలింపుల్లేవ్! నిజాముద్దీనే కొనసాగుతోంది: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో కేసుల్లేవని చెప్పారు. 450 మందికి పరీక్షలు చేస్తే ఆదివారం 18 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపారు.
మే1 వరకు తగ్గే అవకాశం
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 858 చేరుకున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. 651 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. మొత్తం 21 మరణాలు సంభవించాయని కేసీఆర్ తెలిపారు. మే 1 వరకు తెలంగాణలో కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు. మే మొదటి వారం నుంచి కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని వైద్య విభాగం కూడా తెలిపిందని చెప్పారు.
గతంలో నిబంధనలే..
ఇక తెలంగాణలో ఎలాంటి సడలింపులూ లేవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ సడలింపులు ఉండవని తెలిపారు. గతంలో ఉన్న నిబంధనలే కొనసాగుతాయన్నారు. ఇది వరకు లాగే నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయన్నారు.
నిజాముద్దీన్ సమస్యే..
విదేశీ ప్రయాణికులు ఎవరూ చనిపోలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. 26వేల మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. నిజాముద్దీన్ సమస్యే ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. వారి కుటుంబసభ్యులు, వారు కలిసిన వారిని గుర్తించడం జరుగుతోందని అన్నారు.తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఉండగా, మే 3 వరకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని తెలిపారు.
Recommended Video
తెలంగాణలో మే 7 వరకు..
తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు లాక్డౌన్ పొడిగించాలని కోరినట్లు తేలిందని కేసీఆర్ చెప్పారు. అవసరమైతే మే నెలాఖరు వరకూ పొడిగించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. మే 8నే లాక్ డౌన్ సడలింపు అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.
మే 5 నాడు మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, పోలీసులను కోరినట్లు సీఎం తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలు సహకరించాలన్నారు. మే 8 వరకు విమానాశ్రయాలకు కూడా ఎవరూ రావొద్దని సూచించారు. జీఎంఆర్ కు కూడా సమాచారం ఇస్తామని చెప్పారు.