మేడారం జాతరకు కరోనా ముప్పు; జాతరకు ముందే పోటెత్తుతుతున్న వేలాది భక్తులతో కొత్త చిక్కు
కోవిడ్ -19 యొక్క మూడవ తరంగం తెలంగాణా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. కరోనా లక్షణాలున్న ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ సమయంలో కూడా ప్రజలు మేడారం జాతర సమీపిస్తున్న సమయంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవటానికి మేడారం బాట పట్టారు. జాతర సమయంలోనే కాకుండా జాతర ముందు కూడా భక్తులు విశేషంగా గిరిజనుల ఆరాధ్య దైవాలైన మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మేడారంలో భక్తుల తాకిడితో కరోనా ఆందోళన మరింత పెరుగుతుంది.

మేడారం జాతరకు ముందే మొదలైన జన జాతర .. పోటెత్తుతున్న భక్తులు
ములుగు జిల్లా ఆరోగ్య అధికారులు సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందు మేడారం గ్రామంలో క్రమంగా పెరుగుతున్న జనాలను పర్యవేక్షించడం చాలా కష్టమైన పనని ఎదుర్కొంటున్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర 2022 ఫిబ్రవరి 16-19 తేదీలలో జరగాల్సి ఉండగా, తరువాత కోవిడ్ అడ్డంకులు ఉంటాయనే భయంతో చాలా మంది యాత్రికులు గ్రామానికి ముందస్తుగానే వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు.సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించే భక్తుల రద్దీ పెరిగింది.

వేల సంఖ్యలో మేడారంలో భక్తులు .. కరోనా ఆందోళన
నిత్యం వేల సంఖ్యలో భక్తులు మేడారం వెళ్తున్నారు. సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్తున్న భక్తులు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించటం లేదు. సామాజిక దూర నిబంధనలను తుంగలో తొక్కి మాస్కులు కూడా సరిగా ధరించకుండా వెళ్తున్న తీరు కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున జరుగుతుందన్న అభిప్రాయానికి కారణంగా మారింది.
ఇప్పటికే ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని ములుగు జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు.

సామాజిక దూరం పాటించటం లేదు .. కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వైద్యులు
గత కొన్ని రోజుల నుండి ప్రతిరోజూ వేలాది మంది మేడారం వస్తున్నారు . భౌతిక దూరాన్ని నిర్ధారించడం మాకు చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు . జాతర సమయంలో ఇదే పరిస్థితి కొనసాగితే, అది రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల భారీ పెరుగుదలకు దారి తీస్తుంది అని అంటున్నారు . మేడారం వద్ద ఇప్పటికే పారిశుధ్య కార్మికులను పంపి పారిశుధ్య పనులను చేపట్టినా పరిస్థితి గందరగోళంగానే ఉంది. మేడారంలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మేడారంలో విధులను నిర్వర్తిస్తున్న పలువురు వైద్య మరియు ఆరోగ్య సిబ్బందికి కూడాకరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

జ్వర సర్వేలోనూ ఆందోళనకర పరిస్థితి.. మేడారంలో కరోనా ముప్పు
ములుగు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డిఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ అల్లం అప్పయ్య మేడారంలో వందల సంఖ్యలో భక్తులు కోవిడ్ లక్షణాలతో అస్వస్థతకు గురైనట్లు జ్వర సర్వే నిర్వహిస్తున్న బృందాలు గుర్తించాయని చెప్పారు. మేడారంలో 10 బృందాలు రాత్రింబవళ్లు పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు . వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. ఎవరికి వారు కరోనాను నియంత్రించే విధంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వచ్చే నెలలో మహా జాతర జరగనున్న నేపధ్యంలో ఇప్పుడే కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న మేడారం, ముందు ముందు మరెంత ప్రమాదాన్ని చూడనుందో.. మరెంత కరోనా ముప్పును ఎదుర్కోనుందో అన్నది ఆందోళన కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications