coronavirus: వృద్దుడి మృతితో జమాత్ వెళ్లినవారిపై ఆరా, తెలుగురాష్ట్రాల నుంచి భారీగా, క్వారంటైన్లో..
ఇటీవల ఢిల్లీలో ఓ మతానికి చెందిన సభలు జరిగాయి. అయితే జమాత్కు హాజరైన వృద్దుడు శనివారం చనిపోయాడు. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్దుడు.. జ్వరంతో బాధపడి ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు. అతను చనిపోయాక పరీక్ష చేయగా.. అతనికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఢిల్లీ సభలపై తెలుగు రాష్ట్రాల పోలీసులు ఫోకస్ చేశారు. హస్తినలో జరిగిన మత సమావేశానికి ఎవరెవరూ వెళ్లారు..? వారి పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై దృష్టిసారించారు.
తెలుగురాష్ట్రాల నుంచి.
హస్తినలో జరిగిన జమాత్కు తెలుగురాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఏపీలో 50 మంది వరకు, తెలంగాణలో 40 మంది వెళ్లినట్టు తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అయితే అతను ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. అతను ఎవరితో సన్నిహితంగా మెలిగాడు, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేశారు. అతనితోపాటు మరో 39 మంది కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సమావేశానికి హాజరైనట్టు తెలిసి పోలీసుల ఆశ్చర్యపోయారు. వారిని పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ సహా 40 మంది రక్త నమునాలను గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఎందుకైనా మంచిదని 25 మందిని క్వారంటైన్కు తరలించారు. మరో 15 మంది ఆచూకీ కనుగొనేందుకు రంగంలోకి దిగారు.
హోం క్వారంటైన్..
ఇటు ఏపీలో కూడా జమాత్కు వెళ్లిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో 11 మందిని అధికారులు గుర్తించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతోన్నాయి. విజయనగరంలో 12 మందిని, రాజమండ్రిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఉరవకొండ, వజ్రకరూర్కి చెందిన ఐదుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఇలా వెలుగులోకి..
నాంపల్లికి చెందిన వృద్దుడి మరణంతో ఢిల్లీలో జరిగిన జమాత్ వెలుగులోకి వచ్చింది. పెద్దగా జరిగిన మత సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారి జాబితా తీస్తే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికీ దాదాపుగా అందరికీ పరీక్షలు నిర్వహించామని పోలీసు అధికారులు చెప్తున్నారు. కరోనా వైరస్ ఉన్న వారిని ఐసోలేషన్ వార్డులో లేదంటే, హోం ఐసోలేషన్లో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు.
Recommended Video
మూడురోజులు మకాం..
వృద్దుడి మరణంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. మార్చి 14వ తేదీన అతను జమాత్ కోసం ఢిల్లీ వెళ్లాడు. అక్కడే మూడురోజుల పాటు ఉండి.. 17వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. ఇంటికి తిరిగొచ్చాక జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. కానీ కరోనాకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో అతను శనివారం చనిపోయాడు. తర్వాత వైద్యులకు అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతని కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచారు.